సత్తాకు పరీక్ష

17 Sep, 2019 01:58 IST|Sakshi

నేటి నుంచి చైనా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ

మరో టైటిల్‌పై ప్రపంచ చాంపియన్‌ పీవీ సింధు గురి

పురుషుల సింగిల్స్‌ బరిలో సాయిప్రణీత్, కశ్యప్‌

అద్వితీయ ప్రదర్శనతో విశ్వవిజేతగా అవతరించి... అన్ని వర్గాల నుంచి ఆత్మీయ సత్కారాలు, స్వాగతాలు అందుకొని... కొత్త చరిత్ర మధుర క్షణాలను ఆస్వాదించి... మూడు వారాలుగా బిజీబిజీగా గడిపిన భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టనుంది. నేడు మొదలయ్యే చైనా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 టోర్నమెంట్‌లో ఈ తెలుగు తేజం టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగనుంది.

ప్రపంచ చాంపియన్‌షిప్‌ కోసం పక్కాగా సిద్ధమై అనుకున్న లక్ష్యాన్ని అందుకున్న సింధు... చైనా గడ్డపై రెండోసారి విజేతగా నిలవాలని పట్టుదలతో ఉంది. వచ్చే ఏడాది ఒలింపిక్స్‌ జరగనున్న నేపథ్యంలో ఇక నుంచి సింధు ఆటతీరును ఆమె ప్రత్యర్థులు నిశితంగా గమనించే అవకాశం ఉంది. సరికొత్త వ్యూహాలతో ఈసారీ తన ప్రత్యర్థులకు సింధు చెక్‌ పెడుతుందో లేదో వేచి చూడాలి. 
 
చాంగ్‌జౌ (చైనా): భారత బ్యాడ్మింటన్‌ స్టార్స్‌ మరో సమరానికి సిద్ధమయ్యారు. నేటి నుంచి మొదలయ్యే చైనా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 టోర్నమెంట్‌లో మహిళల ప్రపంచ చాంపియన్‌ పీవీ సింధు, మాజీ రన్నరప్‌ సైనా నెహా్వల్‌... పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ ఛాంపియన్ షిప్ కాంస్య పతక విజేత భమిడిపాటి సాయిప్రణీత్, కశ్యప్‌ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. స్విట్జర్లాండ్‌లో గత నెలలో ముగిసిన ప్రపంచ చాంపియన్‌షిప్‌ తర్వాత భారత అగ్రశ్రేణి క్రీడాకారులు పాల్గొంటున్న తొలి టోర్నమెంట్‌ ఇదే కానుంది.

కాస్త కఠినమే...  
మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు ఐదో సీడ్‌గా, సైనా నెహ్వాల్‌ ఎనిమిదో సీడ్‌గా బరిలోకి దిగనున్నారు. బుధవారం జరిగే తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో ప్రపంచ మాజీ నంబర్‌వన్, 2012 లండన్‌ ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత లీ జురుయ్‌తో సింధు... ప్రపంచ 19వ ర్యాంకర్‌ బుసానన్‌ ఒంగ్‌బామ్‌రుంగ్‌ఫన్‌ (థాయ్‌లాండ్‌)తో సైనా ఆడతారు. లీ జురుయ్‌తో ముఖాముఖి రికార్డులో సింధు 3–3తో సమంగా ఉండగా... సైనా 3–1తో బుసానన్‌పై ఆధిక్యంలో ఉంది. గాయం కారణంగా కొంతకాలం ఆటకు దూరమైన లీ జురుయ్‌ మళ్లీ పూర్వ వైభవం కోసం ప్రయతి్నస్తోంది. ఈ ఏడాది ఇండోనేసియా మాస్టర్స్‌ టోరీ్నలో లీ జురుయ్‌తో ఆడిన సింధు మూడు గేమ్‌లపాటు పోరాడి గెలిచింది. గత నెలలో ముగిసిన ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీలకు పక్కా ప్రణాళికతో సిద్ధమైన సింధు చైనా ఓపెన్‌లోనూ సత్తా చాటుకోవాలని పట్టుదలతో ఉంది.

2016లో ఈ టోరీ్నలో విజేతగా నిలిచిన సింధు అదే ఫలితాన్ని ఈసారి పునరావృతం చేయాలని భావిస్తోంది. తొలి రౌండ్‌ గట్టెక్కితే సింధుకు క్వార్టర్‌ ఫైనల్లో మూడో సీడ్‌ చెన్‌ యుఫె (చైనా), సెమీస్‌లో రెండో సీడ్‌ తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ) లేదా సైనా ఎదురయ్యే అవకాశముంది. గాయం నుంచి కోలుకున్న రెండుసార్లు ప్రపంచ మాజీ చాంపియన్, రియో ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత కరోలినా మారిన్‌ ఈ టోరీ్నలో ఆడుతోంది. గతవారం వియత్నాం ఓపెన్‌లో మారిన్‌ తొలి రౌండ్‌లోనే ఓడిపోయింది. ఈ టోర్నీ తొలి రౌండ్‌లో నాలుగో సీడ్‌ నొజోమి ఒకుహారా (జపాన్‌)తో మారిన్‌ ఆడుతుంది. ఇదే పార్శ్వంలో టాప్‌ సీడ్‌ అకానె యామగుచి (జపాన్‌), మాజీ విశ్వవిజేత రచనోక్‌ (థాయ్‌లాండ్‌) ఉన్నారు.

కోచ్‌ కిమ్‌ జీ హ్యున్‌ లేకుండానే...
ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సింధు స్వర్ణం సాధించడంలో కీలకపాత్ర పోషించిన భారత మహిళల సింగిల్స్‌ కోచ్‌ కిమ్‌ జీ హ్యున్‌ (దక్షిణ కొరియా) చైనా ఓపెన్‌కు జట్టు వెంట వెళ్లడం లేదు. తన భర్త ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆమె స్వదేశం వెళ్లిపోయింది. ఆమె తిరిగి జట్టుతో ఎప్పుడు చేరుతుందనే అంశంపై స్పష్ట మైన సమాచారం లేదు. కనీసం రెండు వారాలపాటు ఆమె తన కుటుంబంతో ఉండే అవకాశముంది.  

సాయిప్రణీత్‌ జోరు కొనసాగేనా...
పురుషుల సింగిల్స్‌లో భారత్‌ నుంచి నలుగురు ఎంట్రీలు పంపించినా... మోకాలి గాయం కారణంగా కిడాంబి శ్రీకాంత్‌... డెంగీ జ్వరంతో ప్రణయ్‌ ఈ టోర్నీ నుంచి వైదొలిగారు. దాంతో భారత్‌ ఆశలన్నీ సాయిప్రణీత్, పారుపల్లి కశ్యప్‌పై ఆధారపడ్డాయి. పురుషుల సింగిల్స్‌లో 36 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ప్రపంచ చాంపియన్‌íÙప్‌లో కాంస్య పతకం నెగ్గిన భారత ప్లేయర్‌గా గుర్తింపు పొందిన సాయిప్రణీత్‌ ఈ టోర్నీలో ఎలా రాణిస్తాడో వేచి చూడాలి. తొలి రౌండ్‌లో సుపన్యు అవింగ్‌సనోన్‌ (థాయ్‌లాండ్‌)తో సాయిప్రణీత్‌ ఆడతాడు.

తొలి రౌండ్‌లో గెలిస్తే రెండో రౌండ్‌లో మూడో సీడ్‌ షి యు కి (చైనా)తో సాయిప్రణీత్‌ ఆడే చాన్స్‌ ఉంది. కశ్యప్‌ తొలి రౌండ్‌లో లెవెర్‌డెజ్‌ (ఫ్రాన్స్‌)తో తలపడతాడు.  పురుషుల డబుల్స్‌లో సాతి్వక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి... సుమీత్‌ రెడ్డి–మను అత్రి జోడీలు పోటీ పడనున్నాయి. మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి–అశి్వని పొన్నప్ప... మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సిక్కి రెడ్డి–ప్రణవ్‌ చోప్రా; అశ్విని పొన్నప్ప–సాత్విక్‌ సాయిరాజ్‌ జంటలు బరిలో ఉన్నాయి.   

మరిన్ని వార్తలు