మరో ‘సూపర్‌’ టైటిల్‌ లక్ష్యంగా...

19 Sep, 2017 00:19 IST|Sakshi
మరో ‘సూపర్‌’ టైటిల్‌ లక్ష్యంగా...

జపాన్‌ ఓపెన్‌ బరిలో సింధు
సైనా, శ్రీకాంత్‌లపై దృష్టి


టోక్యో: వరుసగా రెండో సూపర్‌ సిరీస్‌ టైటిల్‌ను సాధించాలనే లక్ష్యంతో భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు జపాన్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ టోర్నీ బరిలోకి దిగనుంది. మంగళవారం మొదలయ్యే ఈ టోర్నీలో... మహిళల సింగిల్స్‌లో సింధుతోపాటు సైనా నెహ్వాల్‌... పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, సౌరభ్‌ వర్మ, సమీర్‌ వర్మ,  ప్రణయ్‌ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. తొలి రోజు క్వాలిఫయింగ్‌తోపాటు మిక్స్‌డ్‌ డబుల్స్‌లో మెయిన్‌ ‘డ్రా’ తొలి రౌండ్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. పురుషుల సింగిల్స్‌ క్వాలిఫయింగ్‌ తొలి రౌండ్‌లో ఎమిల్‌ హోస్ట్‌ (డెన్మార్క్‌)తో కశ్యప్‌ ఆడతాడు.

మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో మితాని మినత్సు (జపాన్‌)తో సింధు... పోర్న్‌పవీ చోచువోంగ్‌ (థాయ్‌లాండ్‌)తో సైనా తలపడతారు. ఒకవేళ సింధు తొలి రౌండ్‌ దాటితే ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఆమె ప్రపంచ చాంపియన్‌ నొజోమి ఒకుహారా (జపాన్‌) లేదా చెయుంగ్‌ ఎన్గాన్‌ యి (హాంకాంగ్‌)లతో ఆడే చాన్స్‌ ఉంది. మరోవైపు సైనాకు ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ ప్రత్యర్థి గా రియో ఒలింపిక్స్‌ విజేత కరోలినా మారిన్‌ (స్పెయిన్‌) లేదా చెన్‌ జియోజిన్‌ (చైనా) ఎదురవుతారు. ఆదివారం జరిగిన కొరియా ఓపెన్‌ ఫైనల్లో ఒకుహారాపై సింధు గెలిచి టైటిల్‌ నెగ్గిన సంగతి తెలిసిందే. సింధు, సైనా ఒకే పార్శ్వంలో ఉండటంతో వీరిద్దరూ సెమీఫైనల్లో తలపడే అవకాశముంది.   

మరిన్ని వార్తలు