క్వార్టర్స్‌లో సింధు, శ్రీకాంత్‌

9 Nov, 2018 02:22 IST|Sakshi

చైనా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ  

 ఫుజౌ (చైనా): భారత స్టార్‌ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌ చైనా ఓపెన్‌ బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్‌ సింధు 21–12, 21–15తో అన్‌సీడెడ్‌ ఒంగ్‌బామ్‌రంగ్‌ఫన్‌ (థాయ్‌లాండ్‌)పై నెగ్గింది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన సింధు తొలి గేమ్‌లో 11–4తో ఆధిక్యంలోకి వెళ్లింది.

అదే అధిపత్యం కొనసాగిస్తూ గేమ్‌ గెలుచుకుంది. రెండో గేమ్‌లో ప్రత్యర్థి నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైనా కీలక సమయాల్లో పాయింట్లు సాధించిన సింధు గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. పురుషుల సింగిల్స్‌  ప్రిక్వార్టర్‌ ఫైనల్లో శ్రీకాంత్‌ 10–21, 21–9, 21–9తో టామీ సుగియార్తో (ఇండోనేసియా)పై గెలిచాడు. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ 11–21, 14–21తో జొనాథన్‌ క్రిస్టీ (ఇండోనేసియా) చేతిలో ఓడాడు.

పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి జంట 16–21, 21–14, 21–15తో వాహ్యూ నాయకా ఆర్య–యూసుఫ్‌ సంతోసో (ఇండోనేసియా) జోడీపై గెలిచి క్వార్టర్స్‌కు చేరింది. మహిళల డబుల్స్‌లో సిక్కిరెడ్డి–అశ్విని పొన్నప్ప జంట 19–21, 21–15, 17–21తో షిహో తనాకా–కొహరు యోనెమోటో (జపాన్‌) జోడీ చేతిలో ఓడింది. 

మరిన్ని వార్తలు