పీవీ సింధుకు మరో షాక్‌.. 

25 Sep, 2019 13:24 IST|Sakshi

ఇంచియోన్‌ (దక్షిణ కొరియా): ప్రతిష్టాత్మక ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సత్తా చాటిన భారత షట్లర్లు.. వరుసగా చైనా, కొరియా టోర్నీలలో మాత్రం తీవ్రంగా నిరాశపరుస్తున్నారు. తాజాగా కొరియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌-500టోర్నీలో ప్రపంచ చాంపియన్‌ భారత స్టార్‌ షట్లర్‌, తెలుగు తేజం పీవీ సింధు అనూహ్య పరాజయం చవిచూసింది. గతవారం చైనా ఓపెన్‌లో ప్రిక్వార్టర్‌ ఫైనల్లోనే ఓడిన సింధు బుధవారం జరిగిన కొరియా ఓపెన్‌ తొలి మ్యాచ్‌లోనే ఓటమి చవిచూసింది.

తొలి రౌండ్‌లో చైనా సంతతికి చెందిన అమెరికా క్రీడాకారిణి బీవెన్‌ జాంగ్‌పై 7-21, 24-22, 21-15 తేడాతో ఓడిపోయి ఇంటిబాట పట్టింది. ఇటీవలే జరిగిన ప్రపంచ చాంపియన్‌లో బీవెన్‌ జాంగ్‌పై సునాయసంగా గెలిచిన సింధు నేటి మ్యాచ్‌లో మాత్రం తడబడింది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ చాంపియన్‌షిప్‌ కాంస్య పతక విజేత సాయిప్రణీత్ కూడా కొరియా ఓపెన్‌లో ఇంటిదారి పట్టాడు. డెన్మార్క్‌కు చెందిన ఆంటోన్సెన్‌తో మ్యాచ్‌లో తొలి రౌండ్‌లో ఓడిపోయిన ప్రణీత్‌.. రెండో రౌండ్‌లో గాయపడ్డాడు. దీంతో రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. దీంతొ కొరియా ఓపెన్‌లో సింధు, సాయి ప్రణీత్‌ల ప్రయాణం ముగిసింది. ఇక మరో స్టార్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ పైనే ఆశలు ఉన్నాయి.  

మరిన్ని వార్తలు