సింధును కలవడం ఆనందంగా ఉంది: మోదీ

27 Aug, 2019 14:22 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలిచి స్వదేశంలో అడుగుపెట్టిన  బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధుకు ఘన స్వాగతం లభించింది. సోమవారం రాత్రి ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆమె.. మంగళవారం  ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు.  సింధుతో పాటు తన నివాసానికి వచ్చిన కోచ్‌ గోపీచంద్‌లను మోదీ అభినgదించారు. దీనిలో భాగంగా సింధు మెడలో పసిడి పతకం వేసి సత్కరించారు.

ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాని తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ‘ పసిడి పతకం సాధించి దేశం గర్వపడేలా చేసిన చాంపియన్‌ సింధు. ఆమెను కలవడం ఆనందంగా ఉంది. భవిష్యత్‌లో ఇలాంటి ఎన్నో అద్భుత విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నా’ అని మోదీ ట్వీట్‌ చేశారు.తన నివాసానికి వచ్చిన సింధు, కోచ్‌ గోపీచంద్‌లను మోదీ అభినందించారు. సింధు మెడలో పసిడి పతకం వేసి సత్కరించారు.

భారత స్టార్‌ క్రీడాకారిణి సింధు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో చరిత్ర సృష్టించారు. ఈ సిరీస్‌లో స్వర్ణ పతకం సాధించిన తొలి క్రీడాకారిణిగా భారత బ్యాడ్మింటన్‌ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించారు. ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో ఐదో సీడ్‌ సింధు 21-7,21-7తో మూడో సీడ్‌ నొజొమి ఒకుహర(జపాన్‌)ను చిత్తు చేసి చాంపియన్‌గా అవతరించారు సింధు.

మరిన్ని వార్తలు