కోహ్లి, సానియాకు చాలెంజ్‌ విసిరిన సింధు

17 Mar, 2020 15:26 IST|Sakshi

హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో పలువురు ప్రముఖులు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో  ప్రపంచ ఆరోగ్య సంస్థ తీసుకొచ్చిన సేఫ్‌ హ్యాండ్స్‌ చాలెంజ్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇప్పటికే పలువురు ప్రముఖులు తమ చేతులను శుభ్రపరుచుకుంటున్న వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి ఇతరులను కూడా దీనిని పాటించాలని కోరుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని అమెరికా కాన్సుల్‌ జనరల్‌ క్యాథరిన్‌ హడ్డా విసిరిన సేఫ్‌ హ్యాండ్స్‌ చాలెంజ్‌ను బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు స్వీకరించారు. 

ఈ సందర్భంగా క్యాథరిన్‌కు ధన్యవాదాలు తెలిపిన సింధు.. కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు మనం అందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు తమ చేతులను సరైన విధంగా శుభ్రపరుచుకోవాలన్నారు. కేంద్ర క్రీడల మంత్రి కిరణ్‌ రిజిజు, టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి, భారత టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జాలు ఈ చాలెంజ్‌ను స్వీకరించాలని కోరారు. అలాగే తను చేతులను శుభ్రం చేసుకుంటున్న వీడియోను సింధు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

చదవండి : కరోనా అనుమానితుల చేతిపై స్టాంపులు

పాకిస్తాన్‌లో తొలి కరోనా మరణం

>
మరిన్ని వార్తలు