రాంచీ: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరిదైన మూడో టెస్టులో టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఈ రోజు మ్యాచ్ ప్రారంభమైన కాసేపట్లోనే భారత్ రెండు వికెట్లను చేజార్చుకుంది. టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్(10) తొలి వికెట్గా పెవిలియన్ చేరితే, రెండో వికెట్గా చతేశ్వర్ పుజారా ఔటయ్యాడు. దాంతో భారత్ జట్టు 16 పరుగులకు రెండు ప్రధాన వికెట్లను కోల్పోయింది. భారత్ ఇన్నింగ్స్లో భాగంగా రబడా వేసిన ఐదో ఓవర్ ఆఖరి బంతికి అగర్వాల్ ఔటయ్యాడు. రబడా కాస్త స్వింగ్ అయ్యేలా వేసిన బంతిని నిర్లక్ష్యంగా ఆడిన మయాంక్ థర్డ్ స్లిప్లో ఉన్న ఎల్గర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత ఫస్ట్ డౌన్లో వచ్చిన పుజారా ఎక్కువ సేపు క్రీజ్లో నిలబడలేకపోయాడు. రబడా వేసిన ఏడో ఓవర్ తొలి బంతికి తృటిలో ఎల్బీడబ్యూ అయ్యే అవకాశం తప్పించుకున్న పుజారా.. తొమ్మిదో ఓవర్ మూడో బంతికి ఎల్బీగానే ఔటయ్యాడు. తొమ్మిది బంతులు ఆడిన పుజారా డకౌట్గా పెవిలియన్ చేరాడు. ఈ రెండు వికెట్లను రబడా సాధించి దక్షిణాఫ్రికా బ్రేక్ ఇచ్చాడు.
వరుస ఏడు టెస్టులో టాస్ గెలవలేదు
దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ వరుసగా ఏడో టెస్టులో కూడా టాస్ కోల్పోయాడు. భారత్తో మూడో టెస్టులో డుప్లెసిస్.. బావుమాను వెంట పెట్టుకుని వచ్చి టాస్ వేయించినా అది కూడా ఫలితాన్ని ఇవ్వలేదు. వరుసగా టాస్లో ఓడి పోవడంతో టాస్ను వేరే ఒకరి చేత వేయించాలని డుప్లెసిస్ నిర్ణయించుకున్నాడు. అందుకు బావుమాను ఎంచుకున్నాడు. కాకపోతే డుప్లెసిస్కు అదృష్టం కలిసిరాలేదు. టాస్ ఓడిపోవడంతో డుప్లెసిస్ చిరు నవ్వులతో సరిపెట్టుకున్నాడు. డుప్లెసిస్ తన సారథ్యంలో తొలి ఏడు టెస్టుల్లో టాస్లు గెలిస్తే, చివరగా ఏడు టెస్టుల్లో టాస్ కోల్పోవడం గమనార్హం. టాస్లు గెలిచినప్పుడు నాలుగు మ్యాచ్ల్లో సఫారీలు విజయం సాధించగా, రెండు డ్రా చేసుకున్నారు. ఒకటి కోల్పోయారు. టాస్ కోల్పోయిన ఏడు టెస్టుల్లో ఆరు మ్యాచ్ల్లో దక్షిణాఫ్రికా ఓడిపోయింది. ప్రస్తుతం జరిగే మ్యాచ్తో ఏడో టెస్టులో కూడా డుప్లెసిస్ టాస్ కోల్పోవడంతో ఓటమి సెంటిమెంట్ సఫారీలను భయపెడుతోంది.