అందుకే ఓడిపోయాం: రహానే ఆవేదన!

10 Apr, 2018 13:33 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఐపీఎల్‌లో భాగంగా సన్‌రైజర్స్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోవడంపై రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ అంజిక్యా రహానే ఆవేదన వ్యక్తం చేశాడు. మొదట బ్యాటింగ్‌ చేసిన తాము ఒక్క బలమైన భాగస్వామ్యాన్ని కూడా నెలకొల్పలేకపోవడంతోనే తాము ఓడిపోయామని తెలిపాడు.

ఉప్పల్‌ స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన రాజస్తాన్‌ జట్టు నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 125 పరుగుల సాధారణ స్కోరుకే పరిమితమైంది. ఈ స్వప్ప లక్ష్యాన్ని హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌ జట్టు ఆడుతూ పాడుతూ ఛేదించింది. రాజస్తాన్‌ నిర్దేశించిన 126 పరుగుల లక్ష్యాన్ని ఒక్క వికెట్‌ కోల్పోయి.. 15.5 ఓవర్లలోనే ఛేదించింది.  శిఖర్‌ ధావన్‌(77 నాటౌట్‌; 13ఫోర్లు, 1సిక్స్‌) హాఫ్‌ సెంచరీ సాధించగా, కేన్‌ విలియ‍మ్సన్‌(36 నాటౌట్‌; 3ఫోర్లు,1సిక్స్‌) సమయోచితంగా ఆడటంతో సన్‌రైజర్స్‌ సునాయాసంగా విజయం సాధించింది.

మ్యాచ్‌ ఓటమి తర్వాత విలేకరులతో మాట్లాడిన రహానే.. ఓటమికి కారణాలను విశ్లేషించాడు. ‘ఈ వికెట్‌ మీద 150-160 పరుగులు చేస్తే.. నిలబెట్టుకోవచ్చని అనుకున్నాం. మీడియం పేస్‌కు అనుకూలంగా బంతిని పడుతుండటంతో ఆ స్కోరు సరిపోతుందని అనుకున్నాం. కానీ మేం భారీ భాగస్వామ్యాలను నెలకొల్పలేకపోయాం. వరుసగా వికెట్లు పడ్డాయి. ఇన్నింగ్స్‌ను నిలబెట్టే కీలక పార్ట్‌నర్‌షిప్‌ కుదరలేదు’ అని రహానే తెలిపాడు. అయితే, ఐపీఎల్‌లో తమకు ఇది తొలి మ్యాచ్‌ మాత్రమేనని, రానున్న మ్యాచ్‌ల్లో తమ జట్టు ఉత్తమ ప్రదర్శన కనబరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. జట్టుకు అందుబాటులో ఉన్న విదేశీ ఆటగాళ్లైన బెన్‌ స్టోక్స్‌, జోస్‌ బట్లర్‌, డీ ఆర్సీ షార్ట్‌, బెన్‌ లాఫ్‌లిన్‌ మంచి సమర్థులైన క్రీడాకారులని, అద్భుతంగా ఆడే సత్తా వారికి ఉందని ఓ ప్రశ్నకు బదులిచ్చారు.

స్టీవ్‌ స్మిత్‌ అద్భుతమైన ఆటగాడని, అతను లేకపోయినా అతని గురించి తాము ఆలోచిస్తున్నామని, మ్యాచ్‌లో ప్రతి ఒక్కరూ మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టుకు కెప్టెన్‌గా తీసుకున్న స్టీవ్‌ స్మిత్‌ బాల్‌ ట్యాపంరింగ్‌ వివాదం కారణంగా ఐపీఎల్‌కు దూరమైన సంగతి తెలిసిందే. అదే క్రమంలో జట్టుకు కీలకంగా ఉపయోగపడతాడని భావించిన శ్రీలంక పేస్‌ బౌలర్‌ దుశ్మంత చమీరా కూడా గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది.

మరిన్ని వార్తలు