ముంబై: టీమిండియా క్రికెటర్ అజింక్యా రహానే తన కూతురితో ఆనందంగా గడుపుతున్నాడు. శనివారం భార్య రాధికా ధోపావ్కర్ ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అయితే దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు ఆడుతున్న నేపథ్యంలో రహానే.. కూతురు పుట్టిన వెంటనే అక్కడికి వెళ్లలేకపోయాడు. అయితే దక్షిణాఫ్రికాతో మొదటి టెస్టు ముగిసిన తర్వాత రహానే తన కూతురి దగ్గరకు చేరుకున్నాడు. తన కూతురిని చేతుల్లోకి తీసుకుని మురిసిపోయాడు. భార్యతో కలిసి చిన్నారిని తనవి తీరా చూస్తున్న ఫోటోను రహానే తన ట్వీటర్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. ఒకవైపు దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో భారత్ గెలిచిన ఆనందంలో ఉన్న రహానే.. తన జీవితంలోకి కూతురి రాకతో రెట్టింపు ఉత్సాహంతో ఉన్నాడు.
టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ శనివారమే రహానేకు శుభాకాంక్షలు తెలియజేశాడు. ‘ కొత్త తండ్రికి అభినందలు. రహానే భార్య రాధికకు చిన్న రాణికి కూడా కంగ్రాట్స్. వారిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నా. రహానే.. ఇప్పుడు జీవితంలో సరదా పార్ట్ మొదలైంది’ అని హర్భజన్ పేర్కొన్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలైన రాధికాను ఐదేళ్ల క్రితం రహానే వివాహం చేసుకున్నాడు. తొలుత స్కూల్ మేట్స్గా ఆరంభమైన వీరి ప్రయాణం.. ఆపై ఫ్రెండ్షిప్కు దారి తీసింది. అది మరింత బలపడి ప్రేమకు దారి తీసింది. దాంతో రహానే-రాధికలు కలిసి జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే 2014లో రహానే-రాధికలు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.