అఫ్గాన్‌ లక్ష్యం 263

24 Jun, 2019 18:58 IST|Sakshi

సౌతాంప్టన్‌: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ 263 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. ముష్ఫికర్‌ రహీమ్‌(83), షకీబుల్‌ హసన్‌(51)లు రాణించడంతో గౌరవప్రదమైన స్కోరు సాధించింది. టాస్‌ గెలిచిన అఫ్గానిస్తాన్‌ ముందుగా ఫీల్డింగ్‌ ఎంచుకోవడంతో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ శుభారంభం లభించలేదు. బంగ్లాదేశ్‌ ఓపెనర్‌ లిటాన్‌ దాస్‌(16) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఆ సమయంలో తమీమ్‌ ఇక్బాల్‌-షకీబుల్‌ హసన్‌ల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. ఈ జోడి 59 పరుగులు జత చేసిన తర్వాత తమీమ్‌(36) ఔటయ్యాడు. కాగా, షకీబుల్‌-ముష్ఫికర్‌ రహీమ్‌ల జోడి సమయోచితంగా బ్యాటింగ్‌ చేసింది.

కాగా, బంగ్లాదేశ్‌ స్కోరు 143 పరుగుల వద్ద ఉండగా షకీబుల్‌ హాఫ్‌ సెంచరీ సాధించిన తర్వాత పెవిలియన్‌ చేరాడు. ఆపై కాసేపటికి సౌమ్య సర్కార్‌(3) కూడా ఔట్‌ కావడంతో బంగ్లాదేశ్‌ కష్టాల్లో పడింది. ఆ తరుణంలో ముష్పికర్‌ రహీమ్‌ బాధ్యతాయుతంగా బ్యాటింగ్‌ చేశాడు.  అతనికి మహ్మదుల్లా(27), మొసదెక్‌ హుస్సేన్‌(35)ల నుంచి సహకారం లభించడంతో బంగ్లాదేశ్‌ తిరిగి తేరుకుంది. రహీమ్‌ ఆరో వికెట్‌గా పెవిలియన్‌ చేరగా, హుస్సేన్‌ చివరి బంతికి ఔటయ్యాడు. దాంతో బంగ్లాదేశ్‌ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి  262 పరుగులు చేసింది. అఫ్గాన్‌ బౌలర్లలో ముజీబ్‌ ఉర్‌ రహ్మాన్‌ మూడు వికెట్లు సాధించగా, నైబ్‌కు రెండు వికెట్లు లభించాయి. దవ్లాత్‌ జద్రాన్‌, నబీలు తలో వికెట్‌ తీశారు.

మరిన్ని వార్తలు