మాంచెస్టర్: వన్డే వరల్డ్కప్లో భాగంగా వెస్టిండీస్ జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ తృటిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. 64 బంతుల్లో 6 ఫోర్లతో 48 పరుగులు చేసిన రాహుల్ రెండో వికెట్గా పెవిలియన్ చేరాడు. విండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ వేసిన 21 ఓవర్ నాల్గో బంతికి రాహుల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో 98 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ను నష్టపోయింది. రోహిత్ నిష్క్రమణ తర్వాత కోహ్లితో కలిసి ఇన్నింగ్స్ నడిపించే బాధ్యతను తీసుకున్న రాహుల్.. బంతిని అంచనా వేయడంలో విఫలమై బౌల్డ్ అయ్యాడు. కోహ్లి-రాహుల్లు రెండో వికెట్కు 69 పరుగుల భాగస్వామ్యం సాధించారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. దాంతో భారత్ ఇన్నింగ్స్ను రోహిత్-రాహుల్ ఆరంభించారు. అయితే జట్టు స్కోరు 29 పరుగుల వద్ద ఉండగా రోహిత్(18) వివాదాస్పద రీతిలో ఔటయ్యాడు. (ఇక్కడ చదవండి: ఇదేం డీఆర్ఎస్రా నాయనా!)
భారత్ ఇన్నింగ్స్లో భాగంగా కీమర్ రోచ్ వేసిన ఆరో ఓవర్ చివరి బంతి రోహిత్ బ్యాట్కు, ప్యాడ్కు మధ్యలోంచి కీపర్ షాయ్ హోప్ చేతుల్లోకి వెళ్లింది. దీనిపై విండీస్ అప్పీల్కు వెళ్లగా ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. అయితే దీనిపై విండీస్ రివ్యూ కోరంగా అందులో భారత్కు వ్యతిరేకంగా ఫలితం వచ్చింది. కాగా, ఇది ఔటా..నాటౌటా అనే దానిపై పూర్తిగా స్పష్టత లేని క్రమంలో థర్డ్ అంపైర్ ఔట్గా ప్రకటించడం వివాదాస్పదంగా మారింది.