రైనా 'రెస్ట్' వెనుక 'పెద్ద' కథే నడిచిందట!

8 Aug, 2015 12:43 IST|Sakshi
రైనా 'రెస్ట్' వెనుక 'పెద్ద' కథే నడిచిందట!

గత నెల జింబాబ్వేలో పర్యటించిన భారత జట్టులో సభ్యుల ఎంపిక, కెప్టెన్సీ ఎవరికి కట్టబెట్టాలనే నిర్ణయాల వెనుక పెద్ద కథే నడిచినట్లు తెలిసింది. నిజానికి ఆ పర్యటనకు టీమిండియా కెప్టెన్గా సురేశ్ రైనా పేరును సెలక్షన్ కమిటీ ఖరారు చేసింది. కానీ చివరి నిమిషంలో బీసీసీఐలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ పెద్ద మనిషి ఒత్తిడి మేరకు రైనాకు రెస్ట్ ఇచ్చి అజింక్యా రహానేను కెప్టెన్గా ప్రకటించింది.

జింబాబ్వే టూర్కు జట్టును ఎంపిక చేసేందుకు సెలక్షన్ కమిటీ జూన్ 29న ముంబైలో సమావేశమైంది. సీనియర్లకు విశ్రాంతి కల్పించడంతోపాటు యువ జట్టును సిద్ధం చేసి.. వారికి సారధిగా రైనాను ఎంపికచేశారు. కానీ బీసీసీఐ పెద్ద రాకతో సీన్ రివర్సయింది. రైనాకు కెప్టెన్సీ వద్దని, ఇతర సీనియర్లలాగే అతనికి కూడా రెస్ట్ ఇవ్వమని సెలక్షన్ కమిటీని ఒత్తిడి చేశాడట ఆ పెద్దమనిషి. మరోదారిలేని సెలెక్టర్లు ఆయన చెప్పినట్లే రైనాకు విశ్రాంతినిచ్చారు. ఎందుకిలా చేశారంటే..

సెలక్షన్ కమిటీ సమావేశానికి సరిగ్గా రెండురోజుల ముందు ఐపీఎల్ స్కాంస్టర్ లలిత్ మోదీ ఓ సంచనల ట్వీట్ వదిలాడు. 'చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడే సురేశ్ రైనా, రవిచంద్రన్ అశ్విన్, డ్వెయిన్ బ్రావోలు ఓ రియల్ ఎస్టేట్ దిగ్గజం నుంచి ముడుపులు తీసుకుని ఫిక్సింగ్ కు పాల్పడ్డారు' అని మోదీ ఆ ట్వీట్ లో పేర్కొన్నాడు. దీంతో రైనాపై నమ్మకం సడలిందని, ప్రస్తుత పరిస్థితుల్లో అతనికి కెప్టెన్సీ కట్టబెట్టడం అంగీకారం కాదని బీసీసీఐ పెద్దలు భావించారట. అదే విషయాన్ని తమ సహచరుడి ద్వారా సెలక్షన్ కమిటీకి చెప్పించారట.

ఆ సందర్భంలోనే  'సెలక్షన్ కమిటీ నిర్ణయాం వెనుక లలిత్ మోదీ ట్వీట్ ప్రభావమేమైనా ఉందా?' అనే ప్రశ్నకు బీసీసీఐ సెక్రటరీ అనురాగ్ ఠాకూర్ బదులిస్తూ 'రైనా అంతర్జాతీయ స్థాయి ఆటగాడు కనుక ఐసీసీయే అతడి వ్యవహార్ని పర్యవేక్షిస్తుంది' అని చెప్పడం, రైనా కూడా 'నేను ఎలాంటి తప్పుచేయలేదు. ఆటే ప్రాణంగా శ్వాసించాను' అని ప్రకటించడం తెలిసిందే.

మరిన్ని వార్తలు