బౌలింగ్‌, ఫీల్డింగ్‌ల్లో సన్‌రైజర్స్‌ అదుర్స్‌

9 Apr, 2018 21:47 IST|Sakshi

హైదరాబాద్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-11 సీజన్‌లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌తో సొంత మైదానంలో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌ రైజర్స్‌ బౌలింగ్‌, ఫీల్డింగ్‌ల్లో అదుర్స్‌ అనిపించింది. టాస్‌ ఓడి తొలుత రాజస్తాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన రైజర్స్‌.. అందుకు తగ్గట్టుగానే రాణించింది. రాజస్తాన్‌ రాయల్స్‌ను ఏ దశలోనూ తేరుకోనీయకుండా చేసి భారీగా పరుగులు చేయకుండా నియంత్రించిం‍ది.

సన్‌ రైజర్స్‌ బౌలర్లలో సిద్ధార్ధ్‌ కౌల్‌, షకిబుల్‌ హసన్‌ చెరో రెండు వికెట్ల తీసి ఆకట్టుకోగా,  భువనేశ్వర్‌ కుమార్‌, బిల్లీ స్టాన్‌లేక్‌, రషీద్‌ ఖాన్‌లు తలో వికెట్‌ తీశారు. అయితే సన్‌ రైజర్స్‌ బౌలింగ్‌ విభాగాన్ని పంచుకున్న ఐదుగురు బౌలర్లూ 30 పరుగులు మించకుండా బౌలింగ్‌ వేయడం మ్యాచ్‌లో విశేషం. మరొకవైపు రెండు రనౌట్లు చేసి ఫీల్డింగ్‌లో సన్‌రైజర్స్‌ సత్తాచాటింది. దాంతో రాజస్తాన్‌ నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 125 పరుగుల సాధారణ స్కోరుకే పరిమితమైంది. రాజస్తాన్‌ ఇన్నింగ్స్‌ను అజింక్యా రహానే, డీఆర్సీ షార్ట్‌లు ఆరంభించగా వారికి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. డీ ఆర్సీ షార్ట్‌(4) నిరాశపరిచడంతో రాజస్తాన్‌ ఆరు పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. కేన్‌ విలియమ్సన్‌ రనౌట్‌ చేయడంతో డీ ఆర్సీ షార్ట్‌ తన వికెట్‌ను సమర‍్పించుకున్నాడు. 

అటు తర్వాత రహానే-సంజూ సామ్సన్‌ల జోడి ఇన్నింగ్స్‌ను నడిపించే బాధ్యతను తీసుకుంది. అయితే జట్టు స్కోరు 52 పరుగుల వద్ద రహానే(13) రెండో వికెట్‌గా ఔటయ్యాడు. ఆపై ఎన్నో ఆశలు పెట్టుకున్న బెన్‌ స్టోక్స్‌(5) కూడా పెవిలియన్‌ బాట పట్టడంతో రాజస్తాన్‌ 63 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే సామ్సన్‌(49; 42 బంతుల్లో 5 ఫోర్లు) రాణించడంతో రాజస్తాన్‌ తిరిగి తేరుకుంది. సామ్సన్‌ పరుగు దూరంలో హాఫ్‌ సెంచరీని కోల్పోయిన తర్వాత మిగతా ఆటగాళ్లు పెద్దగా ఆకట్టుకోలేదు. రాహుల్‌ త్రిపాఠి(17), శ్రేయస్‌ గోపాల్‌(18)లు మాత్రమే సామ్సన్‌ తర్వాత అత్యధిక స్కోరు చేసిన ఆటగాళ్లు. దాంతో 126 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే రాజస్తాన్‌ నిర్దేశించింది.

మరిన్ని వార్తలు