జైపూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ఇక్కడ సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో కింగ్స్ పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ అజింక్యా రహానే ముందుగా బ్యాటింగ్ చేసేందుకే మొగ్గుచూపాడు. అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్లో కింగ్స్ పంజాబ్ విజయం సాధించింది. కింగ్స్ పంజాబ్ ఇప్పటివరకూ 9 మ్యాచ్లు ఆడి ఆరు మ్యాచ్లు గెలిచి మూడో స్థానంలో కొనసాగుతుండగా, రాజస్తాన్ రాయల్స్ 9 మ్యాచ్లకు గాను మూడు మాత్రమే గెలిచి చివరి స్థానంలో ఉంది.
ఈ మ్యాచ్లో కింగ్స్ పంజాబ్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. మయాంక్ అగర్వాల్, అంకిత్ రాజ్పుత్లను పక్కను పెట్టగా, వారి స్థానాల్లో అక్షదీప్ నాథ్, మోహిత్ శర్మలకు తుది జట్టులో చోటు దక్కింది. ఇక రాజస్తాన్ రాయల్స్ మూడు మార్పులు చేసింది. డీ ఆర్సీ షాట్, శ్రేయస్ గోపాల్, రాహుల్ త్రిపాఠిలకు ఉద్వాసన పలకగా, మహిపాల్ లోమ్రోర్, స్టువర్ట్ బిన్నీ, ఇష్ సోథీలకు అవకాశం కల్పించింది.
ఈ సీజన్లో పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన అశ్విన్ నేతృత్వంలోని కింగ్స్ పంజాబ్ చక్కటి విజయాలను సాధిస్తోంది. అదే సమయంలో రాజస్తాన్ మాత్రం పేలవ ప్రదర్శన కనబరుస్తూ గెలుపు ముంగిట చతికిలబడుతోంది. రాజస్తాన్ ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే ఇక నుంచి ఆడే ప్రతీ మ్యాచ్లో గెలుపు అనివార్యం. దాంతో రాజస్తాన్పై విపరీతమైన ఒత్తిడి నెలకొంది. కాగా, కింగ్స్ పంజాబ్ అటు బ్యాటింగ్లోనూ ఇటు బౌలింగ్లోనూ ఆకట్టుకుంటూ విజయాలను నమోదు చేస్తోంది. ఈ నేపథ్యంలో కింగ్స్ పంజాబ్ను రాజస్తాన్ రాయల్స్ ఎంతవరకూ నిలువరిస్తుందో చూడాలి.
తుది జట్లు
రాజస్తాన్ రాయల్స్
అజింక్యా రహానే(కెప్టెన్), జోస్ బట్లర్, సంజూ శాంసన్, బెన్ స్టోక్స్, కృష్ణప్ప గౌతమ్, అనురిత్ సింగ్, జోప్రా ఆర్చర్, జయదేవ్ ఉనాద్కట్, మహీపాల్ లోమ్రోర్, స్టువర్ట్ బిన్నీ, ఇష్ సోథీ
కింగ్స్ పంజాబ్
రవిచంద్రన్ అశ్విన్(కెప్టెన్), క్రిస్గేల్, కేఎల్ రాహుల్, మనోజ్ తివారీ, కరుణ్ నాయర్, అక్షదీప్ నాథ్, స్టోయినిస్, అక్షర్ పటేల్, ఆండ్రూ టై, మోహిత్ శర్మ, ముజీబ్ ఉర్ రహ్మాన్