పతకం పోయినా... 10 లక్షలు వచ్చాయి 

7 Sep, 2018 00:54 IST|Sakshi

న్యూఢిల్లీ: ఏషియాడ్‌లో దురదృష్టం వెంటాడి కాంస్యం కోల్పోయిన భారత అథ్లెట్‌ గోవిందన్‌ లక్ష్మణన్‌ను నజరానా వరించింది. కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్‌ రాథోడ్‌... అతడిని నగదు పురస్కారానికి ఎంపిక చేశారు. ఈ లాంగ్‌ డిస్టెన్స్‌ రన్నర్‌ 10 వేల మీటర్ల పరుగులో మూడో స్థానంలో నిలిచాడు.

కానీ మరో అథ్లెట్‌ నెట్టడంతో అతని అడుగు అనూహ్యంగా ట్రాక్‌ లైన్‌ను దాటి బయటపడింది. దీంతో అనర్హతకు గురై పతకాన్ని కోల్పోయాడు. మరో అథ్లెట్‌ తగలడం వల్లే అతను లైన్‌  దాటాడని భారత్‌ చేసిన అప్పీల్‌ను నిర్వాహకులు తోసిపుచ్చారు. అయితే పరుగును పూర్తిచేసిన లక్ష్మణన్‌ కఠోర శ్రమను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నజరానాకు ఎంపిక చేసినట్లు రాథోడ్‌ తెలిపారు. 
 

మరిన్ని వార్తలు