రాజ్యవర్ధన్‌ నయా ఛాలెంజ్‌

9 Jan, 2019 22:02 IST|Sakshi

న్యూఢిల్లీ: గతంలో క్రీడాకారులు, బాలీవుడ్‌ తారలకు ఫిట్‌నెస్‌ చాలెంజ్‌ విసిరిన కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌ తాజాగా మరో సవాల్‌కు శ్రీకారం చుట్టారు. బుధవారం పుణేలో ‘ఖేలో ఇండియా’ క్రీడాపోటీలను ప్రారంభించిన ఆయన #5MinuteAur పేరుతో చేసిన కొత్త చాలెంజ్‌ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ వీడియోలో ఆయన రెండు చేతులతోనూ టేబుల్‌ టెన్నిస్‌ ఆడుతూ కనిపించారు. ‘చిన్నప్పుడు మనం హోమ్‌వర్క్‌ చేసుకోకుండా ఆడుకుంటూ ఉంటే అమ్మ మనల్ని వారించేది. వచ్చి హోమ్‌వర్క్‌ చేసుకోవాలని హెచ్చరించేది. అప్పుడు మనం ‘ఇంకో ఐదు నిమిషాలే’ అని అనే ఉంటాం.

ఈ అనుభవం దాదాపు అందరికీ ఎదురయ్యే ఉంటుంది. ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరూ ఐదు నిమిషాల పాటు క్రీడల గురించి ఆలోచించండి. ఖేలో ఇండియా కార్యక్రమంలో భాగంగా మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఉంటే పంచుకోండి’ అంటూ ఈ వీడియో సందేశాన్ని ఆయన వినిపించారు. ఈ చాలెంజ్‌ ప్రాముఖ్యాన్ని చెబుతూ భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీ, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, బాలీవుడ్‌ నటి  దీపికా పదుకోన్‌ను ట్యాగ్‌ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. క్రీడా అభివృద్ధికి మంత్రి చేస్తున్న కృషి పట్ల నెటిజన్లు ఫిదా అవుతూ.. ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.   
 

మరిన్ని వార్తలు