రామకృష్ణకు ఏడో విజయం

19 May, 2019 09:51 IST|Sakshi

ఫిడే రేటింగ్‌ చెస్‌ టోర్నమెంట్‌

సాక్షి, హైదరాబాద్‌: ఐజీఎంఎస్‌ఏ ఫిడే రేటింగ్‌ చెస్‌ టోర్నమెంట్‌లో ఆంధ్రాబ్యాంక్‌కు ప్రాతినిధ్యం వహిస్తోన్న జె. రామకృష్ణ ఏడో విజయాన్ని అందుకున్నాడు. రాయదుర్గంలోని ఒయాసిస్‌ స్కూల్‌ వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో అతను ఏడు రౌండ్ల అనంతరం 7 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇండియన్‌ గ్రాండ్‌ మాస్టర్స్‌ స్పోర్ట్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో శనివారం జరిగిన ఏడో రౌండ్‌ గేమ్‌లో ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్‌ ఎం. నిఖిల్‌పై రామకృష్ణ గెలుపొందాడు. తెలంగాణ ప్లేయర్లు భరత్‌కుమార్‌ రెడ్డి, ఎస్‌.ఖాన్‌లతో పాటు కర్ణాటక ఆటగాడు బాలకిషన్‌ 6 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు.

మిగతా ఏడో రౌండ్‌ గేముల్లో వి. పృథ్వీ కుమార్‌ (ఆంధ్రప్రదేశ్‌)పై టాప్‌సీడ్‌ భరత్‌కుమార్‌రెడ్డి (తెలంగాణ), వైభవ్‌ సింగ్‌ వర్మ (ఢిల్లీ)పై ఎ. బాలకిషన్‌ (కర్ణాటక), శ్రీథన్‌ (తెలంగాణ)పై ఎస్‌.ఖాన్‌ (తెలంగాణ) విజయం సాధించారు. టి. సిద్ధాంత్‌ (మహారాష్ట్ర)తో జె. శరణ్య (తమిళనాడు), సీహెచ్‌ సాయి వర్షిత్‌ (ఆంధ్రప్రదేశ్‌)తో ఎం. రిత్విక్‌ రాజా, రౌనక్‌ (పశ్చిమ బెంగాల్‌)తో శిబి శ్రీనివాస్‌ (తెలంగాణ), నీరజ్‌ అనిరుధ్‌ (తెలంగాణ)తో సాయికృష్ణ (తెలంగాణ), వైష్ణవి (ఆంధ్రప్రదేశ్‌)తో అంకిత (తెలంగాణ) తమ గేమ్‌లను డ్రా చేసుకున్నారు.    

మరిన్ని వార్తలు