చాంపియన్‌ జె. రామకృష్ణ

20 May, 2019 10:03 IST|Sakshi

‘ఫిడే’ రేటింగ్‌ చెస్‌ టోర్నమెంట్‌

సాక్షి, హైదరాబాద్‌: ఐజీఎంఎస్‌ఏ ఫిడే రేటింగ్‌ చెస్‌ టోర్నమెంట్‌లో ఫిడే మాస్టర్‌ జె.రామకృష్ణ (ఆంధ్రా బ్యాంక్‌) చాంపియన్‌గా నిలిచాడు. ఇండియన్‌ గ్రాండ్‌మాస్టర్స్‌ స్పోర్ట్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నమెంట్‌లో నిర్ణీత 9 రౌండ్లకుగానూ 8.5 పాయింట్లు సాధించి రామకృష్ణ అగ్రస్థానాన్ని అందుకున్నాడు. రాయదుర్గంలోని ఒయాసిస్‌ స్కూల్‌ వేదికగా ఆదివారం జరిగిన చివరిదైన తొమ్మిదోరౌండ్‌ గేమ్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పి. ఉదయ్‌ కిరణ్‌పై అతను విజయం సాధించాడు. తెలంగాణ క్రీడాకారుడు భరత్‌కుమార్‌ రెడ్డి 7.5 పాయింట్లతో రన్నరప్‌గా నిలిచాడు.

కర్ణాటకకు చెందిన ఎ. బాలకిషన్‌ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో తెలంగాణ రాష్ట్ర చెస్‌ సంఘం (టీఎస్‌సీఏ) కార్యదర్శి కె. శివ ప్రసాద్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. విజేతగా నిలిచిన రామకృష్ణ ట్రోఫీతో పాటు రూ. 50,000 ప్రైజ్‌మనీని అందుకున్నా డు. భరత్‌కుమార్‌ రెడ్డి రూ. 35,000, బాలకిషన్‌ రూ. 30,000 నగదు బహుమానాన్ని పొందారు. టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ రూ. 6 లక్షలు. దీన్ని 70 మంది క్రీడాకారులకు అందజేశారు.

మరిన్ని వార్తలు