తాత్కాలిక కోచ్‌గా మాజీ స్పిన్నర్‌!

16 Jul, 2018 12:32 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇటీవల భారత మహిళా క్రికెట్‌ జట్టు కోచ్‌ పదవికి తుషార్‌ అరోథి గుడ్‌ బై చెప్పిన నేపథ్యంలో తాత‍్కాలిక కోచ్‌గా మాజీ ఆఫ్‌ స్పిన్నర్‌ రమేశ్‌ పవార్‌కు బాధ్యతలు అప్పచెప్పినట్లు తెలుస్తోంది.  దీనిలో భాగంగా మహిళా క్రికెట్‌ జట్టు అసిస్టెంట్‌ కోచ్‌ బిజూ జార్జ్‌తో కలిసి పవార్‌ పని చేసేందుకు రంగం సిద్దమైంది.  జూలై 25 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకూ బెంగళూరులో జరిగే భారత మహిళా క్రికెట్‌ జట్టు శిక్షణా శిబిరంలో పవార్‌ పాల్గొనున్నాడు. ఈ క‍్రమంలోనే పవార్‌కు తాత్కాలిక కోచ్‌గా బాధ్యతలు అ‍ప్పజెప్పినట్లు సమాచారం.

ఇప్పటికే మహిళా క్రికెట్‌ కోచ్‌ పదవికి బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. దరఖాస్తులు స్వీకరించడానికి  ఆఖరి తేదీ జూలై 20. దరఖాస్తు చేసుకునే వ్యక్తికి జాతీయ స్థాయిలో క్రికెట్‌ ఆడిన అనుభవంతో పాటు 55 ఏళ్లలోపు వయసు కల్గి ఉండాలి. ఈ విషయాన్ని బీసీసీఐ తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.  అయితే కోచ్‌ను ఎంపిక చేసేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున పవార్‌ను తాత్కాలిక కోచ్‌గా నియమించినట్లు తెలుస్తోంది.

>
మరిన్ని వార్తలు