రామ్‌కుమార్‌ శుభారంభం

25 Jun, 2019 06:09 IST|Sakshi
రామ్‌కుమార్‌, సాకేత్‌

పోరాడి ఓడిన సాకేత్‌

వింబుల్డన్‌ క్వాలిఫయింగ్‌ టోర్నమెంట్‌

లండన్‌: ప్రతిష్టాత్మక వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ క్వాలిఫయింగ్‌ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు లభించాయి. పురుషుల సింగిల్స్‌ విభాగంలో రామ్‌కుమార్‌ రామనాథన్‌ శుభారంభం చేయగా... సాకేత్‌ మైనేని పోరాటం తొలి రౌండ్‌లోనే ముగిసింది. సోమవారం మొదలైన ఈ టోర్నమెంట్‌లో తొలి రౌండ్‌ మ్యాచ్‌లో రామ్‌కుమార్‌ 6–3, 6–2తో లుకాస్‌ లాకో (స్లొవేకియా)పై గెలుపొందగా... ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్‌ సాకేత్‌ 4–6, 6–4, 5–7తో గిలెర్మో లోపెజ్‌ (స్పెయిన్‌) చేతిలో ఓడాడు. లాకోతో జరిగిన మ్యాచ్‌లో రామ్‌ తొమ్మిది ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్‌ చేశాడు. 24 విన్నర్లు కొట్టిన ఈ చెన్నై ప్లేయర్‌ కేవలం పది అనవసర తప్పిదాలు చేశాడు. లోపెజ్‌తో జరిగిన మ్యాచ్‌లో సాకేత్‌ 15 ఏస్‌లు సంధించి, రెండు డబుల్‌ ఫాల్ట్‌లు చేశాడు. 43 విన్నర్స్‌ కొట్టిన సాకేత్‌ 29 అనవసర తప్పిదాలు చేశాడు. తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్‌ చేశాడు.   
 

మరిన్ని వార్తలు