రంజీ సమరానికి వేళాయె

9 Dec, 2019 03:21 IST|Sakshi

నేటి నుంచి దేశవాళీ క్రికెట్‌ టోర్నీ

టైటిల్‌ బరిలో 38 జట్లు

మూలపాడు (విజయవాడ): విజయ్‌ హజారే వన్డే ట్రోఫీ, సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టి20 ట్రోఫీ వంటి పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ధనాధన్‌ ఇన్నింగ్స్‌లతో అలరించిన భారత యువ క్రికెటర్లను ఇక నాలుగు రోజులపాటు సాగే మ్యాచ్‌లు సవాళ్లు విసరనున్నాయి. వారిలోని నిజమైన టెక్నిక్‌ను, ఓపికను, ఫిట్‌నెస్‌ను పరీక్షించేందుకు నేటి నుంచి రంజీ ట్రోఫీ వేదిక కానుంది. ఇప్పటికే పరిమిత ఓవర్ల దేశవాళీ టోర్నీల్లో ఆకట్టుకున్న యువ ఆటగాళ్లు ఇక్కడ కూడా మెరిసి భారత టెస్టు జట్టులో స్థానం సంపాదించాలని చూస్తుండగా... పునరాగమనం కోసం మరికొందరు ఈ రంజీ సీజన్‌ను ఉపయోగించుకోవాలని పట్టుదలతో ఉన్నారు. ఇక గత రెండు సీజన్‌ల్లో టైటిల్‌ గెలిచి డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో బరిలో దిగుతున్న విదర్భ మరోసారి టైటిల్‌ గెలిచి హ్యాట్రిక్‌ను పూర్తి చేయాలని చూస్తోంది. అదే గనుక జరిగితే ముంబై తర్వాత హ్యాట్రిక్‌ టైటిల్స్‌ను గెలిచిన జట్టుగా నిలుస్తుంది.  తొలి రౌండ్‌ లీగ్‌ మ్యాచ్‌ల్లో ఆంధ్రతో విదర్భ... హైదరాబాద్‌తో గుజరాత్‌ జట్లు తలపడనున్నాయి. 

సీజన్‌ జరిగే తీరు... 
గత సీజన్‌లో 37 జట్లు బరిలో దిగగా... ఈసారి చండీగఢ్‌ రూపంలో కొత్త జట్టు ఎంట్రీ ఇవ్వనుంది. దీంతో మొత్తం 38 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. లీగ్‌ మ్యాచ్‌లు పూర్తయ్యాక గ్రూప్‌ ‘ఎ’–‘బి’లను కలిపి ‘టాప్‌–5’ స్థానాల్లో నిలిచిన జట్లు, గ్రూప్‌ ‘సి’ నుంచి ‘టాప్‌–2’ జట్లు, ప్లేట్‌ గ్రూప్‌ నుంచి ఒక జట్టు క్వార్టర్స్‌కు అర్హత సాధిస్తాయి. మార్చి 9 నుంచి ఫైనల్‌ జరుగుతుంది.  ఎలైట్‌ గ్రూప్‌ ‘ఎ’: ఆంధ్ర, హైదరాబాద్, విదర్భ, కేరళ, ఢిల్లీ, గుజరాత్, రాజస్తాన్, పంజాబ్, బెంగాల్‌. ఎలైట్‌ గ్రూప్‌ ‘బి’: ముంబై, బరోడా, హిమాచల్‌ ప్రదేశ్, సౌరాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, రైల్వేస్, మధ్యప్రదేశ్‌. ఎలైట్‌ గ్రూప్‌ ‘సి’: త్రిపుర, జమ్మూ కశీ్మర్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, ఒడిశా, సరీ్వసెస్, హరియాణా, జార్ఖండ్, అస్సాం. ప్లేట్‌ గ్రూప్‌: గోవా, మేఘాలయ, మణిపూర్, మిజోరం, చండీగఢ్, అరుణాచల్‌ ప్రదేశ్, నాగాలాండ్, పుదుచ్చేరి, సిక్కిం, బిహార్‌. 

మరిన్ని వార్తలు