ఐపీఎల్‌ ప్రారంభ వేడుకల్లో అలరించేది వీరే..!

24 Mar, 2018 18:42 IST|Sakshi
ఐపీఎల్‌ వేడుక చిత్రం ( ఫైల్‌ )

ముంబై : ఐపీఎల్‌ 2018 ప్రారంభ వేడుకలకు ముంబైలోని వాంఖడే స్టేడియం అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది. వచ్చే నెల 7న జరుగబోతున్న 11వ సీజన్‌ ఆరంభ వేడుకల్లో యంగ్‌ బాలీవుడ్‌ యాక్టర్స్‌ అలరించబోతున్నారు. రణ్‌వీర్‌ సింగ్‌, పరిణీతి చోప్రా, వరుణ్‌ ధావన్‌, జాక్వలిన్ ఫెర్నాండెజ్‌లు స్టేజీపై తమ ప్రదర్శన ఇవ్వనున్నట్లు ఓ జాతీయ చానెల్‌ పేర్కొంది.

ఇక తొలి మ్యాచ్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ల మధ్య జరుగనుంది. గత రెండేళ్లుగా ఐపీఎల్‌కు దూరమైన చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఈ సీజన్‌తో పునరాగమనం చేస్తున్న విషయం తెలిసిందే. 

వాంఖడే స్టేడియంలో జరిగే ఈ ప్రారంభ వేడుకలకు మాజీ క్రికెటర్లు, బాలీవుడ్‌ నటులతో పాటు మ్యాచ్‌ జరుగుతున్న ఇరుజట్ల కెప్టెన్లు మాత్రమే పాల్గొననున్నారు. ఆరంభోత్సవం రోజే తొలి మ్యాచ్‌ జరుగుతుండటం, మరుసటి రోజు మ్యాచ్‌లకు ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో బీసీసీఐ మిగతా  కెప్టెన్లకు పాల్గొవాల్సిన అవసరం లేదని ప్రకటించింది. 

దీంతో గౌతమ్‌ గంభీర్(ఢిల్లీ డేర్‌డెవిల్స్‌)‌, రవిచంద్రన్‌ అశ్విన్(కింగ్స్‌ ఎలవెన్‌ పంజాబ్‌)‌, దినేశ్‌ కార్తీక్ (కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌)‌, విరాట్‌ కోహ్లీ(రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు), డేవిడ్‌( సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌), స్టీవ్‌ స్మిత్‌(రాజస్తాన్‌ రాయల్స్‌)  హాజరుకావడం లేదు. అయితే ఒక రోజు ముందే కెప్టెన్ల  ప్రసంగాన్ని  రికార్డు చేసి వేడుకల సందర్భంగా ప్రసారం చేయనున్నట్లు బీసీసీఐ అధికారులు తెలిపారు. అయితే ఈ సారి ఐపీఎల్‌ ప్రారంభ వ్యయాలను మాత్రం రూ.30 కోట్ల నుంచి రూ.20 కోట్లకు తగ్గించారు.

>
మరిన్ని వార్తలు