దిగ్గజాల సరసన రషీద్‌ ఖాన్‌

7 Sep, 2019 13:22 IST|Sakshi

చాట్టోగ్రామ్‌: అఫ్గానిస్తాన్‌ క్రికెట్‌ కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌ అరుదైన క్లబ్‌లో చేరిపోయాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో రషీద్‌ ఖాన్‌ ఐదు వికెట్లు సాధించి ఆ జట్టు పతనాన్ని శాసించాడు. ఫలితంగా బంగ్లాదేశ్‌ 205 పరుగులకే తన తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. 194/8 ఓవర్‌నైట్‌ స్కోరుతో మూడో రోజు ఆటను ఆరంభించిన బంగ్లాదేశ్‌ మరో 11 పరుగుల మాత్రమే సాధించి మిగతా రెండు వికెట్లను చేజార్చుకుంది. అఫ్గాన్‌ సంచలనం ఐదు వికెట్లతో సత్తాచాటాడు. మరొకవైపు అఫ్గాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో రషీద్‌(51) హాఫ్‌ సెంచరీ సాధించాడు. తద్వారా కెప్టెన్సీ అరంగేట్రపు టెస్టు మ్యాచ్‌లో యాభైకి పైగా పరుగులు, ఐదు వికెట్లు సాధించిన అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.

ఇప్పటివరకూ టెస్టు ఫార్మాట్‌లో తమ అరంగేట్రపు కెప్టెన్సీ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌  షెల్డాన్‌ జాక్సన్‌, పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ ఇమ్రాన్‌, బంగ్లాదేశ్‌ ఆల్‌ రౌండర్‌ షకీబుల్‌ హసన్‌లు మాత్రమే ఈ ఫీట్‌ను చేరగా, తాజాగా రషీద్‌ ఖాన్‌ వారి సరసన చేరాడు.  కాగా, టెస్టు క్రికెట్‌లో రషీద్‌ టెస్టుల్లో ఐదేసి వికెట్లు సాధించడం రెండోసారి. అంతకుముందు ఈ ఏడాది ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రషీద్‌ ఐదు వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు.  బంగ్లాదేశ్‌తో టెస్టు మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన అఫ్గానిస్తాన్‌ ఓపెనర్‌ జనాత్‌(4) వికెట్‌ను ఆరంభంలోనే కోల్పోయింది. అయితే తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన రహ్మత్‌ షా హాఫ్‌ సెంచరీతో మెరిశాడు. ప్రస్తుతం అఫ్గానిస్తాన్‌ 270 పరుగుల ఆధిక్యంలో ఉంది.

>
మరిన్ని వార్తలు