ఆమ్రేకు పోటీగా రాథోడ్‌

4 Aug, 2019 16:20 IST|Sakshi

న్యూఢిల్లీ: మాజీ క్రికెటర్‌, మాజీ సెలక్టర్‌ విక్రమ్‌ రాథోడ్‌ టీమిండియా బ్యాటింగ్‌ కోచ్‌ రేసులోకి వచ్చాడు. పరస్పర విరుద్ధ ప్రయోజనాల కారణంగా భారత అండర్‌-19 జట్టు, జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) కోచింగ్‌ పదవికి రాథోడ్‌ చేసిన దరఖాస్తును గతంలో తిరస్కరించారు. అయినా పట్టువదలకుండా తాజాగా టీమిండియా బ్యాటింగ్‌ కోచ్‌ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. రాథోడ్‌ దరఖాస్తు చేసుకోవడంతో ఇప్పటికే రేసులో ఉన్న ప్రవీణ్‌ ఆమ్రేకు గట్టి పోటీ ఎదురైంది. ప్రస్తుతం సంజయ్‌ బంగర్‌పై వ్యతిరేకత రావడంతో.. బ్యాటింగ్‌ కోచ్‌ పదవి ఆమ్రే, రాథోడ్‌ మధ్య రసవత్తర పోటీ నెలకొంది.

'జూనియర్‌ సెలక్షన్‌ ప్యానెల్‌ల చీఫ్‌గా ఉన్న అశిష్‌ కపూర్‌తో సంబంధం ఉండటంతో పరస్పర విరుద్ధ ప్రయోజనాలతో అండర్‌-19, ఎన్‌సీఏ బ్యాటింగ్‌ కోచ్‌ పదవికి రాథోడ్‌ దూరమయ్యాడు. కాగా, భారత క్రికెట్‌ జట్టు బ్యాటింగ్‌ కోచ్‌ పదవికి రాథోడ్‌ దరఖాస్తు చేసుకున్న విషయాన్ని ఒక బీసీసీఐ అధికారి వెల్లడించారు. ప్రస్తుతం సీనియర్‌ బ్యాటింగ్‌ కోచ్‌ కోసం దరఖాస్తు చేసుకోవడం పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకు రాదని సదరు అధికారి తెలిపారు. కెప్టెన్ విరాట్‌ కోహ్లి మద్దతు ఉన్నప్పటికీ.. ప్రస్తుత చీఫ్ కోచ్ రవిశాస్త్రిని తిరిగి ఎంపిక చేయడం అంత సులువేం కాదు. రవిశాస్త్రికి పోటీగా హేమాహేమీలు రంగంలోకి దిగడంతో పోరు రసవత్తరంగా మారింది. రాబిన్ సింగ్, లాల్ చంద్ రాజ్‌పుత్, టామ్ మూడీ, మైఖేల్ హెస్సన్ ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోగా.. గ్యారీ కిర్‌స్టన్ కూడా బరిలో ఉన్నట్టు సమాచారం. ఇక ఫీల్డింగ్‌ కోచ్‌ పదవికి జాంటీరోడ్స్‌ ఫేవరెట్‌గా ఉన్నాడు.

మరిన్ని వార్తలు