న్యూఢిల్లీ: టీమిండియా స్పిన్ బౌలర్ రవి బిష్ణోయ్ దురుసుగా ప్రవర్తించాడంటూ ఐసీసీ సస్సెన్షన్ విధించడంపై అతని తండ్రి మంగిలాల్ బిష్ణోయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై మంగిలాల్ బిష్ణోయ్ స్పందిస్తూ..తన కుమారుడు చాలా ప్రశాంతంగా ఉంటాడని, అతనిపై వస్తున్న ఆరోపణలను విని ఆశ్చర్యపోయానన్నారు. బంగ్లాదేశ్ ఆటగాళ్లు టీమిండియా ఆటగాళ్లపై దాడి చేస్తున్న సందర్భంలో సహచరుడిని కాపాడే క్రమంలో తన కుమారుడు ఆవేశానికి లోనైనట్లు తెలిపారు. ఈ సంఘటనపై కలత చెందిన బిష్ణోయ్ తల్లి భోజనం కూడా చేయడం లేదని వాపోయారు. (‘అతి’కి సస్పెన్షన్ పాయింట్లు)
ఉత్కంఠ భరితంగా సాగే మ్యాచ్లలో యువ ఆటగాళ్లు భావోద్వేగానికి లోనవ్వడం సహజమని ఆయన పేర్కొన్నారు. ఆటగాళ్లు ఒకరినొకరు గౌరవించుకుంటూ క్రీడా స్పూర్తిని ప్రదర్శించాలని మంగిలాల్ బిష్ణోయ్ తెలిపారు. ఆదివారం జరిగిన అండర్ 19 ప్రపంచ కప్ ఫైనల్లో టీమిండియా ఆటగాడు రవి బిష్ణోయ్ ఆర్టికల్ కోడ్ 2.21ను ఉల్లంఘించాడంటూ ఐసీసీ సస్పెన్షన్ విధించింది. భారత్కు చెందిన ఆకాశ్ సింగ్కు 8 సస్పెన్షన్ పాయింట్లు (6 డి మెరిట్ పాయింట్లకు సమానం), రవి బిష్ణోయ్కి 5 సస్పెన్షన్ (2 డి మెరిట్) పాయింట్లు ఐసీసీ విధించింది. అండర్ 19 వరల్డ్ కప్లో టీమిండియా పరాజయం పొందినప్పటికి కొందరు టీమిండియా యువ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. రవి బిష్ణోయ్ టోర్నమెంట్లోనే అత్యధిక వికెట్లను(17) పడగొట్టిన సంగతి తెలిసిందే.