కోహ్లికి కోచ్ రవిశాస్త్రి సవాల్!

7 Feb, 2018 10:54 IST|Sakshi
విరాట్‌ కోహ్లితో టీమిండియా కోచ్ రవిశాస్త్రి (ఫైల్ ఫొటో)

కేప్‌టౌన్‌: టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లికి అత్యంత ఇష్టమైన వ్యక్తి, ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఓ సవాల్ విసిరాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ నెగ్గి చూపించాలన్నది ఆ సవాల్ కాదు. అయితే విషయం ఏంటంటారా... బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ మొదలుపెట్టిన 'ప్యాడ్‌మ్యాన్' సవాల్‌పై రవిశాస్త్రి స్పందించాడు. 'ఈ విషయంపై అక్షయ్‌ బహిరంగ చర్చకు నడుం బిగించినందుకు చాలా సంతోషంగా ఉంది. నా చేతిలో ఓ ప్యాడ్ ఉంది. అక్షయ్.. నోబాల్ ఈ ప్యాడ్‌ (మ్యాన్‌)ను తాకుతుంది. ఇక్కడ నేను విరాట్ కోహ్లి, టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్, బిజినెస్ దిగ్గజం గౌతం సింఘానియాలకు ఈ ప్యాడ్‌మ్యాన్‌ సవాల్ విసురుతున్నానంటూ' ట్వీట్ చేశాడు రవిశాస్త్రి. 

సామాజిక సమస్యలపై పోరాడేందుకు, బాధిత వర్గాలకు మద్ధతు తెలిపేందుకు ఇలాంటి సవాళ్లు స్వీకరించాలని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ఇదేవిధంగా భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఓ శానిటరీ ప్యాడ్‌తో పోస్ట్ పెట్టింది. విస్తృత ప్రచారం కల్పించాలని కోరింది. తమిళనాడుకు చెందిన మురుగనాథమ్‌ జీవితం ఆధారంగా ప్యాడ్‌మ్యాన్ మూవీ తెరకెక్కించారు. రుతుక్రమం సమయంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో భాగంగా తక్కువ ధరకే శానిటరీ ప్యాడ్లు రూపొందించి ఎంతో కృషి చేశారు మురుగనాథమ్. అక్షయ్ కుమార్, రాధికా ఆప్టే, సోనమ్‌ కపూర్‌ కీలకపాత్రలు పోషించిన ఆ మూవీ ఈ 9న విడుదలకు సిద్ధంగా ఉంది. కాగా, వరుసగా రెండు వన్డేల్లో విజయం సాధించిన కోహ్లి నేతృత్వంలోని భారత జట్టు మూడో వన్డేలో నెగ్గి సిరీస్‌లో ఆధిక్యాన్ని 3-0కి పెంచుకుని తమ సత్తా చాటేందుకు సంసిద్ధమైంది.     

మరిన్ని వార్తలు