గంగూలీని కూడా వదిలేశాం: రవిశాస్త్రి

29 Jun, 2018 16:04 IST|Sakshi

డబ్లిన్‌: గతంలో సౌరభ్‌ గంగూలీ చెప్పిన సమయానికి రాకపోతే అతన్ని మిగతా భారత జట్టంతా వదిలి వెళ్లిందట. దీంతో అతడు మరోసారి ఇలా జరగకుండా ఉండేందుకు పది నిమిషాలు ముందుగానే చెప్పిన చోటుకి వెళ్లేవాడట. ప్రస్తుత టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి ఈ విషయాన్ని వెల్లడించాడు.

రవిశాస్త్రి ఇటీవల ఓ వెబ్‌ షోలో టీమిండియాతో తన అనుభవాలను పంచుకున్నాడు. ‘జట్టులో ఆటగాడు తప్పు చేస్తే వారికి నేను మరో అవకాశం ఇవ్వను. సమయపాలనతో వ్యవహరస్తే ఎప్పుడైనా మనం హుందాగా కనిపిస్తాం. ఇదో మంచి లక్షణం. టీమిండియాలో దీనికే అధిక ప్రాధాన్యం. ఆటగాళ్లందరూ తప్పక అనురించాల్సిందే. టీమ్‌ బస్సు తొమ్మిదింటికి స్టార్ట్‌ అని చెప్తే ఆ సమయానికి వెళ్లాల్సిందే. ఎవరు వచ్చారు.. ఎవరు రాలేదు అని చూడరు’ అని చెప్పిన శాస్త్రి తన గత పాత అనుభవాన్ని పంచుకున్నాడు.

‘2007లో నేను టీమిండియాకు మేనేజర్‌గా పని చేశాను. ఆ సమయంలో బంగ్లాదేశ్‌ పర్యటనకు వెళ్లాం. చిట్టగ్యాంగ్‌ మైదానంలో తొలి ప్రాక్టీస్‌ సెషన్‌ ఏర్పాటు చేశారు. తొమ్మిది గంటలకు ఆటగాళ్లతో ఉన్న బస్సు ప్రారంభంకావాలి. బస్సు స్టార్ట్‌ చేయమంటే స్థానికి మేనేజర్‌ ఒకరు దాదా (గంగూలీ) ఇంకా రాలేదు అని అన్నారు. దాదా కారులో వస్తాడులే.. బస్సు స్టార్ట్‌ చెయ్యండి అని అన్నాను. మేము మైదానానికి వెళ్లాం. అప్పటి నుంచి గంగూలీ చెప్పిన సమయానికంటే పది నిమిషాల ముందుగా వచ్చేవాడు’ అని రవిశాస్త్రి తెలిపాడు.
 

మరిన్ని వార్తలు