వద్దంటే ప్రపంచకప్పే ఆడం : రవిశాస్త్రి

22 Feb, 2019 16:00 IST|Sakshi

ముంబై : భారత ప్రభుత్వం ఇంగ్లండ్‌ వేదికగా జరిగే ప్రపంచకప్‌ ఆడవద్దని ఆదేశిస్తే ఆడమని భారత హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి స్పష్టం చేశారు. ప్రభుత్వం, బీసీసీఐ తీసుకునే నిర్ణయమే శిరోధార్యమని తెలిపారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌తో భారత్‌ ఎలాంటి సంబంధాలు కోనసాగించవద్దనే డిమాండ్‌ వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ప్రపంచకప్‌లో పాక్‌తో జరిగే లీగ్‌ మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. మరోవైపు ప్రపంచకప్‌ నుంచి పాక్‌ను బహిష్కరించాలని ఐసీసీని బీసీసీఐ కోరే యోచనలో ఉంది. ఈ క్రమంలో ఈ అంశంపై భిన్నాభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు మ్యాచ్‌ ఆడి గెలిచి సత్తా చాటాలంటుండగా.. మరి కొందరూ 2 పాయింట్లు పోయినా పర్వాలేదు కానీ పాక్‌తో ఆడవద్దని అభిప్రాయపడుతున్నారు.

ఈ నేపథ్యంలో ఈ అంశంపై ఓ జాతీయా ఛానెల్‌తో రవిశాస్త్రి మాట్లాడారు. ‘ ఈ పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ప్రభుత్వానికి, బీసీసీఐకి తెలుసు. వారి తీసుకునే నిర్ణయానికి మేం కట్టుబడి ఉంటాం. ఒకవేళ వారు ప్రపంచకప్‌ను బహిష్కరించాలని ఆదేశించినా నిరభ్యంతరంగా పాటిస్తాం.’  అని స్పష్టం చేశారు. ప్రపంచకప్‌లో భాగంగా జూన్‌ 16న భారత్‌-పాక్‌ మ్యాచ్‌ జరగనుంది. ఇరు జట్లు 2012-13 నుంచి ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం లేదు. కేవలం ఐసీసీ, ఆసియా కప్‌ లాంటి మెగా టోర్నీల్లో మాత్రమే తలపడుతున్నాయన్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు