స్వర్ణాలు నెగ్గిన రవి, సురేంద్ర 

18 Sep, 2018 10:42 IST|Sakshi

తెలంగాణ మాస్టర్స్‌ స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్‌  

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ మాస్టర్స్‌ స్విమ్మిం గ్‌ చాంపియన్‌షిప్‌లో సురేంద్ర అదరగొట్టాడు. సికింద్రాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ స్విమ్మింగ్‌పూల్‌లో జరిగిన ఈ టోర్నీలో నాలుగు పసిడి పతకాలతో సత్తా చాటాడు. 50, 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ ఈవెంట్‌లలో విజేతగా నిలిచిన సురేంద్ర... 50 మీటర్ల బటర్‌ఫ్లయ్, ఫ్రీస్టయిల్‌ విభాగాల్లోనూ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఇదే టోర్నీలో నగరానికి చెందిన సందీప్, శివ యాదవ్, రవి కుమార్‌ పతకాల పంట పండించారు. సందీప్‌ 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్, 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లీ ఈవెంట్‌లలో విజేతగా నిలిచి రెండు స్వర్ణాలను కొల్లగొట్టాడు. 

శివ యాదవ్‌ 100 మీటర్ల బటర్‌ఫ్లయ్, 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ ఈవెంట్‌లలో చాంపియన్‌గా నిలిచి రెండు పసిడి పతకాలను సొంతం చేసుకున్నాడు. రసూల్‌పురాకు చెందిన మరో స్విమ్మర్‌ సిలివేరి రవి కుమార్‌ స్వర్ణం, రెండు రజతాలను గెలుచుకున్నాడు. 25–29 వయో విభాగంలో బరి లోకి దిగిన రవికుమార్‌ 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో పసిడిని అందుకున్నాడు. 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లీ, 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ ఈవెంట్‌లలో రజతాలను కైవసం చేసు కున్నాడు. ఈ విజయాలతో వీరు తెలంగాణ రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారు. ఈ జట్టు కర్నూలులో అక్టోబర్‌ 28, 29 తేదీల్లో జాతీయ మాస్టర్స్‌ స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటుంది. 

మరిన్ని వార్తలు