రవితేజ, నవీన్ శతకాల హోరు

8 Feb, 2014 00:22 IST|Sakshi

 జింఖానా, న్యూస్‌లైన్: బ్యాట్స్‌మెన్ రవితేజ (115), నవీన్ రెడ్డి (101) సెంచరీలతో కదం తొక్కడంతో ఆంధ్రాబ్యాంక్ జట్టు 6 వికెట్ల తేడాతో డెక్కన్ క్రానికల్ జట్టుపై విజయం సాధించింది. హెచ్‌సీఏ మూడు రోజుల నాకౌట్ టోర్నీలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన డెక్కన్ క్రానికల్ 9 వికెట్ల న ష్టానికి 302 పరుగులు చేసింది. రాహుల్ సింగ్ (147) సెంచరీతో విజృంభించగా... షాబాద్ (39), సుందర్ కుమార్ (34 నాటౌట్) ఫర్వాలేదనిపించారు. ఆంధ్రాబ్యాంక్ బౌలర్ కనిష్క్ నాయుడు 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బరిలోకి దిగిన ఆంధ్రాబ్యాంక్ నాలుగే వికెట్లు కోల్పోయి 306 పరుగులు చేసి నెగ్గింది.
 
 మరో మ్యాచ్‌లో ఎస్‌బీహెచ్ జట్టు 17 పరుగుల తేడాతో ఎన్స్‌కాన్స్ జట్టుపై గెలుపొందింది. మొదట బరిలోకి దిగిన ఎస్‌బీహెచ్ 8 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. అహ్మద్ ఖాద్రీ (45), కుషాల్ (42), శ్రీహరి రావు (38 నాటౌట్) మెరుగ్గా ఆడారు. ఎన్స్‌కాన్స్ బౌలర్ రోహన్ 3 వికెట్లు తీసుకున్నాడు. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన ఎన్స్‌కాన్స్ 211 పరుగుల వద్ద ఆలౌటైంది. ఇబ్రహీం ఖలీద్ (59) అర్ధ సెంచరీతో చెలరేగాడు. ఎస్‌బీహెచ్ బౌలర్ రవికిరణ్ 4 వికెట్లు చేజిక్కించుకున్నాడు.
 

మరిన్ని వార్తలు