చెలరేగిన రవితేజ, నవీన్

12 Mar, 2014 23:59 IST|Sakshi

జింఖానా, న్యూస్‌లైన్: ఆంధ్రా బ్యాంక్ బ్యాట్స్‌మెన్  రవితేజ (118 బంతుల్లో 172; 22 ఫోర్లు, 5 సిక్సర్లు), నవీన్ రెడ్డి (188 బంతుల్లో 150; 21 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలతో చెలరేగారు.  అద్భుతమైన బ్యాటింగ్‌తో ఇద్దరూ పరుగుల వరద పారించారు. ఎ-డివిజన్ మూడు రోజుల లీగ్‌లో భాగంగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బుధవారం రెండో రోజు ఓవర్‌నైట్ స్కోరు 330/8తో బరిలోకి దిగిన ఈఎంసీసీ మరో పరుగు చేయకుండానే మిగతా రెండు వికెట్లు కోల్పోయి ఆలౌటైంది.
 
 అనంతర ం లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన ఆంధ్రా బ్యాంక్ బ్యాట్స్‌మెన్ రవితేజ, నవీన్ రెడ్డిలు బ్యాట్లు ఝుళిపించడంతో జట్టు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 424 పరుగుల భారీ స్కోరు చేసింది. దీంతో ఆంధ్రా బ్యాంక్ 94 పరుగుల ఆధిక్యంలో ఉంది. విహారి (45), అర్జున్ యాదవ్ (30 నాటౌట్) మెరుగ్గా ఆడారు.
 
 రాణించిన పవన్, కుషాల్
 డెక్కన్ క్రానికల్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పవన్ కుమార్ (86 బంతుల్లో 84; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు), కుషాల్ జిల్లా (119 బంతుల్లో 59 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో ఎస్‌బీహెచ్ జట్టు భారీ స్కోరు చేసింది. రెండో రోజు ఓవర్‌నైట్ స్కోరు 159/6తో ఆట కొనసాగించిన ఎస్‌బీహెచ్ 321 పరుగులు చేసి ఆలౌటైంది.
 
 దీంతో ఎస్‌బీహెచ్‌కు 155 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. డెక్కన్ క్రానికల్ బౌలర్ సందీప్ 4 వికెట్లు పడగొట్టాడు. తర్వాత తన రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన డెక్కన్ క్రానికల్ ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసింది. ఆకాశ్ భండారి (59), సందీప్ రాజన్ (53 నాటౌట్) అర్ధ సెంచరీలతో చెలరేగగా... షాదాబ్ తుంబి 42 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు.

మరిన్ని వార్తలు