జడేజా 'టాప్'లేపాడు..

8 Aug, 2017 14:50 IST|Sakshi
జడేజా 'టాప్'లేపాడు..

దుబాయ్:గత కొంతకాలంగా టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో కొనసాగుతున్న భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా.. మరో టాప్ ర్యాంకును సైతం కైవసం చేసుకున్నాడు.  తాజా అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ర్యాంకింగ్స్ లో భాగంగా ఆల్ రౌండర్ల విభాగంలో జడేజా టాప్ ప్లేస్ ను ఆక్రమించాడు. ఇక్కడ బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకిబుల్ హసన్ ను జడేజా వెనక్కునెట్టాడు. 

శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో అజేయంగా 70 పరుగులు చేయడంతో పాటు ఏడు వికెట్లు సాధించిన జడేజా తన రేటింగ్ పాయింట్లను మరింత మెరుగుపరుచుకుని ప్రథమ స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం 438 రేటింగ్ పాయింట్లతో జడేజా టాప్ ను సొంతం చేసుకున్నాడు. మరొక భారత ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ 418 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఆల్ రౌండర్ల విభాగంలో మొయిన్ అలీ(409 రేటింగ్ పాయింట్లు) నాల్గో స్థానంలో, బెన్ స్టోక్స్(360 రేటింగ్ పాయింట్లు) ఐదో స్థానంలో కొనసాగుతున్నారు.

ఇదిలా ఉంచితే, టెస్టుల్లో భారత జట్టు తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. కాగా, ఇంగ్లండ్ మూడో స్థానాన్ని ఆక్రమించగా, ఆసీస్ ర్యాంకు దిగజారింది. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్ ను గెలిచిన ఇంగ్లండ్ తన ర్యాంకును మెరుగుపరుచుకుంది. కాగా, సిరీస్ ను కోల్పోయిన దక్షిణాఫ్రికా మాత్రం రెండో స్థానాన్ని పదిలంగా ఉంచుకుంది.

మరిన్ని వార్తలు