యూ ఇడియట్‌.. సిడ్నీ టెస్టు చూడలేదా..!

11 Jan, 2019 13:20 IST|Sakshi

ట్రోల్‌ చేద్దామనుకున్న వ్యక్తిపై జడేజా ఫైర్‌

సెలబ్రిటీల వైఖరి భిన్నంగా తోచినప్పుడు  సోషల్‌ మీడియాలో సెటైర్లు వేయడం, వారిని ట్రోల్‌ చేయడం మనం చూస్తూనే ఉంటాం. అయితే, విపిన్‌ తివారి అనే వ్యక్తి ఇండియన్‌ క్రికెటర్‌ రవీంద్ర జడేజాను  అనవసర కామెంట్‌ చేసి తిట్లు తిన్నాడు.

‘హేర్‌ స్టైల్‌ బాగుందా.. ఇంకా ఏవైనా సలహాలు ఇవ్వండి’ అని జడేజా గురువారం ఇన్‌స్టాగ్రామ్‌లో తన అభిమానులను కోరాడు. విపిన్‌ తివారి అనే యూజర్‌  ‘ఇన్‌స్టాగ్రామ్‌లో టైమ్‌ వేస్ట్‌ చేసే బదులు కాస్త ఆటపై దృష్టి పెట్టు’ అని ట్రోల్‌ చేసేందుకు యత్నించాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన జడేజా.. ‘మీ ఇంట్లో టీవీ లేదా ఇడియట్‌. సిడ్నీ టెస్టు మ్యాచ్‌ చూడలేదా’ అంటూ వ్యాఖ్యానించాడు. కాగా, జడేజాకి అతని అభిమానులు మద్దతుగా నిలిచారు. ‘జడ్డూ భాయ్‌.. అలాంటి ఇడియట్‌ కామెంట్స్‌ పట్టించుకోవద్దు. నీ ఆట గురించి తెలియని వారికి రిప్లై ఇవ్వాల్సిన పనిలేదు’ అని చెప్పారు. 

జడేజా తీరుతో ఉలిక్కిపడిన తివారీ మాట మార్చాడు. ‘రిప్లై ఇచ్చినందుకు థాంక్స్‌. నా కామెంట్‌కు స్పందిస్తారో లేదోనని అలా చేశా. జస్ట్‌ ఫర్‌ ఫన్. నువ్వు ఇండియన్‌ టీమ్‌లో గొప్ప ఆల్‌రౌండర్‌వి‌. మన టీమ్‌కు చాలా అవసరం’ అంటూ చెప్పుకొచ్చాడు.

కాగా, ఆస్ట్రేలియాతో జరిగిన చివరి రెండు టెస్టుల్లో పాల్గొన్న జడేజా మంచి ప్రదర్శన చేశాడు. 7 వికెట్లు తీశాడు. చివరి టెస్టు మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 81 పరుగులు సాధించాడు. ఐసీసీ టెస్టు ర్యాకింగ్స్‌లో బౌలర్‌గా 5 స్థానంలో, ఆల్‌రౌండర్‌గా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

మరిన్ని వార్తలు