త్రీడీ ట్వీట్‌పై స్పందించిన రాయుడు

5 Sep, 2019 17:28 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచకప్‌లో చోటు దక్కపోవడంతో చేసిన వివాదాస్పద 3డీ ట్వీట్‌పై క్రికెటర్‌ అంబటి రాయుడు తొలిసారి స్పందించాడు. ఈ ట్వీట్‌ చేసినందుకు ఎటువంటి పశ్చాత్తాపం లేదని ప్రకటించాడు. ఏ ఒక్కరినో ఉద్దేశించి ఆ ట్వీట్‌ పెట్టలేదని స్పష్టం చేశాడు. తనకు ఆటే ముఖ్యమని, మిగతా వాటి గురించి పట్టించుకోనని అన్నాడు. ప్రపంచకప్‌కు ఎంపిక కాకపోవడం తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని వెల్లడించాడు. ప్రపంచకప్‌ కోసం చాలా శ్రమించానని, సెలక్టర్లు వేరే రకంగా ఆలోచించారని చెప్పుకొచ్చాడు. ఫామ్‌లో ఉన్నప్పటికీ తనను జట్టులోకి తీసుకోకపోవడం దురదృష్టంగా రాయుడు వర్ణించాడు.

గత ప్రపంచకప్‌ సెలక్షన్స్‌లో భాగంగా చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే మాట్లాడుతూ రాయుడు మెరుగైన ఆటగాడని, అయితే విజయ్‌ శంకర్‌ను మూడు రకాలుగా ఉపయోగించుకోవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలపై రాయుడు వ్యంగ్యంగా స్పందిస్తూ మూడు రకాలుగా (త్రీ డైమెన్షన్స్‌) అన్నందుకు ప్రపంచకప్‌ చూసేందుకు త్రీడి కళ్లద్దాలు ఆర్డర్‌ ఇచ్చానని రాయుడు ట్వీట్‌ చేసి తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. ప్రపంచకప్‌లో చోటు దక్కలేదన్న మనస్తాపంతో అంతర్జాతీయ క్రికెట్‌కు రాయుడు రిటైర్‌మెంట్‌ ప్రకటించాడు. అయితే ఇటీవల తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. (చదవండి: రిటైర్మెంట్‌ వెనక్కి తీసుకున్న రాయుడు)

మరిన్ని వార్తలు