రాజస్తాన్‌ లక్ష్యం 159

2 Apr, 2019 21:39 IST|Sakshi

జైపూర్‌: ఐపీఎల్‌లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 159 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. పార్థివ్‌ పటేల్‌(67; 41 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్సర్‌) మినహా ఎవరూ రాణించకపోవడంతో ఆర్సీబీ సాధారణ స్కోరుకే పరిమితమైంది.  టాస్‌ ఓడి మొదటి బ్యాటింగ్‌ చేపట్టిన ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను విరాట్‌ కోహ్లి, పార్థివ్‌ పటేల్‌లు ఆరంభించారు. అయితే జట్టు స్కోరు 49 పరుగుల వద్ద కోహ్లి(23) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. కోహ్లి మంచి టచ్‌లో కనిపించనప్పటికీ శ్రేయస్‌ గోపాల్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. మరో 22 పరుగుల వ్యవధిలో ఏబీ డివిలియర్స్‌(13) కూడా ఔటయ్యాడు.

ఆపై వెంటనే హెట్‌మెయిర్‌(1) సైతం పెవిలియన్‌ బాట పట్టాడు. దాంతో 73 పరుగులకే ఆర్సీబీ మూడు వికెట్లు కోల్పోయింది. తొలి మూడు వికెట్లను శ్రేయస్‌ గోపాల్‌ సాధించి ఆర్సీబీని కష్టాల్లోకి నెట్టాడు.  ఒకవైపు పార్థివ్‌ పటేల్‌ నిలకడగా ఆడి జట్టు స్కోరును చక్కదిద్దాడు. అయితే ఆర్సీబీ స్కోరు 126 పరుగుల వద్ద పార్థివ్‌ నాల్గో వికెట్‌గా ఔటయ్యాడు. ఇక చివర్లో స్టోయినిస్‌(31 నాటౌట్‌), మొయిన్‌ అలీ(18 నాటౌట్‌) ఫర్వాలేదనిపించడంతో ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది.

Liveblog

మరిన్ని వార్తలు