ఐపీఎల్‌-12: వీరి ఖాతాలోనే ‘తొలి ఘనత’

23 Mar, 2019 20:34 IST|Sakshi

చెన్నై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-12వ సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరుగుతున్న ఆరంభపు మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు నెమ్మదిగా ఇన్నింగ్స్‌ ఆరంభించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను విరాట్‌ కోహ్లి, పార్థివ్‌ పటేల్‌లు ఆరంభించారు.  ఈ మ్యాచ్‌లో తొలి ఓవర్‌ను దీపక్‌ చాహర్ వేశాడు. ఆ ఓవర్‌ ఐదో బంతిని పార్ధివ్‌ పటేల్‌ ఫోర్‌ కొట్టాడు. దాంతో ఈ సీజన్‌లో తొలి ఫోర్‌ కొట్టిన ఆటగాడిగా పార్థివ్‌ నిలిచాడు. ఇక ఈ సీజన్‌లో తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరింది కోహ్లినే. హర్భజన్‌ సింగ్‌ వేసిన నాల్గో ఓవర్‌ మూడో బంతికి కోహ్లి ఔటయ్యాడు.

ఫలితంగా ఈ ఐపీఎల్‌లో  మొదటి వికెట్‌ను హర్భజన్‌ సింగ్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆపై  అదే ఓవర్‌ ఆఖరి బంతిని మొయిన్‌ అలీ సిక్స్‌ కొట్టాడు. తద్వారా తాజా ఐపీఎల్‌లో తొలి సిక్స్‌ కొట్టిన ఆటగాడిగా మొయిన్‌ నిలిచాడు. అటు తర్వాత హర్భజన్‌ సింగ్‌ వేసిన ఐదో ఓవర్‌లో మొయిన్‌ అలీ రెండో వికెట్‌గా ఔటయ్యాడు. హర్భజన్‌కే క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. దాంతో ఆర్సీబీ 28 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. ఆర్సీబీ తొలి రెండు వికెట్లను భజ్జీ తీయడం విశేషం.

మరిన్ని వార్తలు