న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రపంచంలో ఉన్న క్రికెట్ లీగ్లతో పోలిస్తే ఐపీఎల్లే అగ్రస్థానంలో ఉంది. ఈ ఐపీఎల్ సీజన్ లో ఆ విషయం మరోసారి రుజువైంది. ఐపీఎల్-10 సీజన్ లో వీక్షకుల సంఖ్య రికార్డు స్థాయికి చేరింది.కేవలం మూడు మ్యాచ్ల్లోనే 185.7 మిలియన్ల వీక్షకులు నమోదయ్యారు. దాంతో పాటు ప్రేక్షకుడు మ్యాచ్ను చూసే సగటు సమయం 72 నిమిషాలుగా నమోదైంది. ఇది ఆల్ టైమ్ రికార్డుగా లిఖించబడింది.
గత సీజన్ లో తొలి మూడు మ్యాచ్ ల వీక్షక్షుల సంఖ్య 160.7 మిలియన్లు కాగా, మ్యాచ్ ను చూసే సగటు సమయం 46 నిమిషాలు మాత్రంగానే ఉంది. ఈ సీజన్ తొలి వారంలోనే రికార్డు స్థాయిలో వీక్షకులు నమోదు కావడం పట్ల ఐపీఎల్ నిర్వహాకులు ఫుల్ జోష్ లో ఉన్నారు.