జొహాన్నెస్బర్గ్: మూడు నెలల కరోనా విరామం తర్వాత దక్షిణాఫ్రికాలో క్రికెట్ పునః ప్రారంభం కానుంది. ఈనెల 18 నుంచి జరుగనున్న ‘3టి క్రికెట్’ సిరీస్తో క్రికెట్ మళ్లీ మొదలు కానుంది. ఈ విషయాన్ని క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్ఏ) తాత్కాలిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాక్వెస్ ఫౌల్ వెల్లడించారు. ‘చాలా ఉత్సాహంగా ఉంది. మా అగ్రశ్రేణి క్రీడాకారులను మళ్లీ టీవీల్లో చూడబోతున్నాం. నెల్సన్ మండేలా జయంతి రోజున తిరిగి ఆట ప్రారంభం కావడం గొప్పగా ఉంది’ అని ఆయన పేర్కొన్నారు.
సాలిడారిటి కప్ పేరిట నిర్వహిస్తోన్న 3టి క్రికెట్ సిరీస్ ద్వారా లభించిన మొత్తాన్ని కోవిడ్–19తో కష్టాలు ఎదుర్కొంటున్న వారి సహాయార్థం వినియోగించనున్నారు. ఈ సిరీస్లో దక్షిణాఫ్రికాకు చెందిన 24 మంది టాప్ క్రికెటర్లు ఎనిమిది మంది చొప్పున 3 జట్లుగా ఏర్పడి తలపడనున్నారు. తొలుత ఈ టోర్నీని జూన్ 27నే నిర్వహించాల్సి ఉన్నప్పటికీ ఏర్పాట్లు పూర్తికాకపోవడంతో జూలై 18కి వాయిదా వేశారు.