‘ఎంఎస్‌ ధోనిని దాటేస్తాడు’

5 Jan, 2019 15:55 IST|Sakshi

సిడ్నీ: టీమిండియా యువ క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌పై ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు రికీ పాంటింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. రిషభ్‌ పంత్‌లో అపారమైన నైపుణ్యం దాగుందనడానికి ఆసీస్‌తో నాల్గో టెస్టులో అతను సాధించిన భారీ సెంచరీనే చక్కటి ఉదాహరణ అని కొనియాడాడు. రిషభ్‌ పంత్‌ కేవలం తొమ్మిది టెస్టుల్లోనే రెండు సెంచరీలు సాధించడంతో పాటు కొన్ని సందర్భాల్లో తొంభైల దగ్గర ఔటైన విషయాన్ని పాంటింగ్‌ ప్రస్తావించాడు.

‘భారత్‌ క్రికెట్‌లో ఎంఎస్‌ ధోని ప్రభావం గురించే మాత్రమే ఇప్పటివరకూ మాట్లాడుకున్నాం. ఇక నుంచి రిషభ్‌ పంత్‌ గురించి మాట్లాడుకుంటా. ధోని ఎక్కువ కాలం టెస్టు క్రికెట్‌ ఆడినా ఈ ఫార్మాట్‌లో కేవలం ఆరు సెంచరీలు మాత్రమే సాధించాడు. అదే సమయంలో ఎన్నో ఘనతలు ధోని సొంతం. కానీ ఈ యువ వికెట్‌ కీపర్‌ కచ్చితంగా ధోనిని దాటేస్తాడు. పరిస్థితులకు తగ్గట్టు ఆడే నైపుణ్యం రిషభ్‌కు ఉంది. అతనిలో అసాధారణ ప్రతిభ దాగి ఉంది. బంతిని స్టైక్‌ చేసే విధానం చూడ ముచ్చటగా ఉంది. అతను బ్యాటింగ్‌ చేసేటప్పుడు ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ను గుర్తుకు తెస్తున్నాడు. ప్రస్తుతం 21 ఒడిలో ఉన్న రిషభ్‌ సుదీర్ఘ కాలం భారత్‌ జట్టుకు సేవలందించడం ఖాయం’ అని పాంటింగ్‌ పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు