చెలరేగిన రిషబ్‌ పంత్‌

21 Apr, 2018 21:52 IST|Sakshi

బెంగళూరు: ఐపీఎల్‌లో భాగంగా రాయల్‌ చాలెంజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ 175 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. శ్రేయస్‌ అయ్యర్‌ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌కు తోడు రిషబ్‌ పంత్‌ మెరుపులు కూడా జత చేయడంతో ఢిల్లీ గౌరవప్రదమైన స్కోరును బోర్డుపై ఉంచింది.  టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేపట్టిన ఢిల్లీకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు జాసన్‌ రాయ్‌(5), గౌతం గంభీర్‌(3)లు తీవ్రంగా నిరాశపరిచారు.

ఆ తరుణంలో రిషబ్‌ పంత్‌-శ్రేయస్‌ అయ్యర్‌ల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. వీరిద్దరూ మూడో వికెట్‌ 75 పరుగులు జత చేసిన తర్వాత శ్రేయస్‌ అయ్యర్‌(52;31 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) పెవిలియన్‌ చేరాడు. అయితే అప్పటికే క్రీజ్‌లో కుదురుకున్న రిషబ్‌ పంత్‌ బ్యాట్‌కు పని చెప్పాడు. తొలుత 34 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న రిషబ్‌ పంత్‌.. ఆపై రెచ్చిపోయి ఆడాడు. చివరి ఓవర్లలో చెలరేగిన రిషబ్‌ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.  ఈ క్రమంలోనే రాహుల్‌ తెవాతియా(13 నాటౌట్; 2 ఫోర్లు‌) కలిసి 65 పరుగుల​ భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు.  అయితే 47 బంతుల్లో 6  ఫోర్లు, 7 సిక్సర్లతో  85 పరుగులు సాధించిన రిషబ్‌..  చివరి ఓవర్‌ నాల్గో బంతికి భారీ షాట్‌కు యత్నించిన ఐదో వికెట్‌గా ఔటయ్యాడు.ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో యజ్వేంద్ర చాహల్‌ రెండు వికెట్లు సాధించగా, ఉమేశ్‌ యాదవ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, కోరీ అండర్సన్‌లకు తలో వికెట్‌ దక్కింది.
 

మరిన్ని వార్తలు