రిషబ్‌ రికార్డుల మోత

10 May, 2018 22:23 IST|Sakshi

ఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ ఆటగాడు రిషబ్‌ పంత్‌ రికార్డుల మోత మోగించాడు.   రిషబ్‌ పంత్‌(128 నాటౌట్‌;63 బంతుల్లో 15 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. ఫలితంగా ఐపీఎల్‌ చరిత్రలో ఒక భారత బ్యాట్స్‌మన్‌ అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన ఘనతను రిషబ్‌ సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే 2010లో మురళీ విజయ్‌ 127 పరుగుల రికార్డను రిషబ్‌ బద్ధలు కొట్టాడు.

మరొకవైపు సన్‌రైజర్స్‌పై అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన రికార్డును కూడా రిషబ్‌ తన పేరిట లిఖించుకున్నాడు. అంతకుముందు సన్‌రైజర్స్‌పై క్రిస్‌ గేల్‌(104 నాటౌట్-ఈ సీజన్‌ ఐపీఎల్‌లో‌) అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డును సాధించగా, దాన్ని రిషబ్‌ సవరించాడు. కాగా, పిన్నవయసులో ఐపీఎల్‌ సెంచరీ సాధించిన రెండో ఆటగాడిగా రిషబ్ అరుదైన మైలురాయిని సొంతం చేసుకున్నాడు. రిషబ్‌ పంత్‌ 20 ఏళ్ల 218 రోజుల వయసులో ఐపీఎల్‌ సెంచరీ నమోదు చేయగా, 2009లో మనీష్‌ పాండ్‌ 19 ఏళ్ల 253 రోజుల వయసులో ఐపీఎల్‌ శతకం సాధించాడు.

ఇక ఒక జట్టు చేసిన స్కోరులో అత్యధిక పరుగుల శాతాన్ని నమోదు చేసిన రెండో ఆటగాడిగా రిషబ్‌ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో రిషబ్‌ 68.44 శాతం పరుగులు సాధించగా, గతంలో బ్రెండన్‌ మెకల్లమ్‌ 71.17 శాతం పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు.

మరిన్ని వార్తలు