రిషబ్‌ గొప్ప ఆటగాడు: యువరాజ్‌ సిగ్‌

20 Jun, 2019 17:08 IST|Sakshi

న్యూఢిల్లీ : ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన టీమిండియా ప్రపంచకప్‌ల హీరో యువరాజ్‌ సింగ్‌ ఊహించిందే నిజమైంది. భారత ప్రపంచ కప్ జట్టులో  రిషభ్‌ పంత్ చేరిక గురించి గతంలోనే స్పష్టమైన అవగాహన ఇచ్చాడు. ప్రపంచకప్‌లో పంత్‌ భారత్‌ తరపున ఆడే అవకాశాలు ఉన్నట్లు తన రిటైర్‌మెంట్‌ రోజునే యువీ జోస్యం చెప్పాడు. ఇది చెప్పిన మరుసటి రోజే ధావన్‌కు బ్యాకప్‌గా పంత్‌ ఇంగ్లండ్‌ వెళ్లాడు. ధావన్‌ ఎడమ చేతి బొటనవేలుకు గాయంకావడంతో వరల్డ్‌కప్‌లోని మిగతా మ్యాచ్‌లకు దూరమైన సంగతి తెలిసిందే.

అధికారికంగా ధావన్ స్థానంలో పంత్ ఎంపికైన తరువాత భారత ప్రపంచ కప్ జట్టులో పంత్‌ భాగమయ్యాడని, ఇతడు  గొప్ప ప్రతిభావంతుడని, పరిమిత ఓవర్ల సమయంలో చక్కటి ప్రదర్శన చేయగలడని యువీ కొనియాడాడు. అతి తక్కువ కాలంలోనే పంత్‌ తన సత్తా నిరూపించుకున్నాడని పేర్కొన్నాడు. అంతేగాక ఇంగ్లండ్‌, ఆస్ర్టేలియాతో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో రెండు సెంచరీలు చేసిన విషయాన్ని గుర్తుచేశాడు. రాబోయే కాలంలో మంచి ప్రదర్శనతో టీంలో కొనసాగాలని కోరుకుంటున్నానని ఆశాభావం వ్యక్తం చేశాడు. 

ఇదిలా ఉండగా.. టీమిండియాలో పంత్‌కు సరైన బ్యాటింగ్‌ స్థానం కనిపించేలా లేదు. ఒకవేళ జట్టులో ఆడే అవకాశం ఉన్నా, నాల్గవ స్థానంలో బ్యాటింగ్‌ చేసే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  అయితే భారత్‌ ఆడబోయే తరువాతి 2 మ్యాచ్‌లలో( అఫ్గానిస్తాన్‌, వెస్టిండిస్‌) రిషబ్‌ ఆడే ఛాన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది.  చివరగా ఆడిన పాకిస్థాన్‌ మ్యాచ్‌లో విజయ్‌ బాల్‌తో మెరవగా.. కేఎల్‌ రాహుల్‌ ఓపెనర్‌గా కుదురుకున్నాడు.  ఇక టీమిండియా తన తరువాతి మ్యాచ్‌ శనివారం అప్గానిస్తాన్‌తో తలపడనుంది.

మరిన్ని వార్తలు