‘పంత్‌పై ఫైనల్‌ నిర్ణయం సెలక్టర్లదే’

7 Jan, 2020 16:06 IST|Sakshi

న్యూఢిల్లీ: గత కొంతకాలంగా ఫామ్‌ కోసం తంటాలు పడుతున్న టీమిండియా యువ వికెట్‌ రిషభ్‌ పంత్‌ను జట్టులో కొనసాగించాలా.. వద్దా అనే నిర్ణయం సెలక్టర్లదేనని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ స్పష్టం చేశాడు. పంత్‌పై తుది నిర్ణయం తీసుకోవాల్సింది సెలక్టర్లే కానీ తాను కాదన్నాడు. పంత్‌ను భారత క్రికెట్‌ జట్టు నుంచి తొలగించి సంజూ సామ్సన్‌ వంటి టాలెంటెడ్‌ వికెట్‌ కీపర్‌కు అవకాశం ఇవ్వాలనే డిమాండ్‌ కొన్ని రోజులుగా బాగా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే గంగూలీకి తాజాగా మరోసారి పంత్‌ గురించి ప్రశ్న ఎదురు కాగా, అది తన పని కాదని, పంత్‌ సంగతి సెలక్టర్లు చూసుకుంటారంటూ చెప్పుకొచ్చాడు.(ఇక్కడ చదవండి: ఎప్పుడైతే నీతో ఉన్నానో..: రిషభ్‌)

పంత్‌లో అపారమైన టాలెంట్‌ ఉందంటూ అతన్ని మరోసారి వెనకేసుకొచ్చాడు గంగూలీ. ‘ పంత్‌ హార్డ్‌ హిట్టింగ్‌ బ్యాట్స్‌మనే కాదు.. ఒక ప్రత్యేకమైన నైపుణ్యం ఉన్న క్రికెటర్‌. అతని టెస్టు రికార్డు బాగుంది. అలానే కీలకమైన సమయంలో ధాటిగా ఆడే ఆటగాడు పంత్‌. వెస్టిండీస్‌తో ఇటీవల జరిగిన సిరీస్‌లో రెండు మ్యాచ్‌ల్లో పంత్‌ బాగా ఆడాడు. అయినా పంత్‌ను కొనసాగించాలా.. వద్దా అనేది సెలక్టర్ల నిర్ణయానికే వదిలి పెడదాం. ఆ విషయాన్ని వారే చూసుకుంటారు. పంత్‌పై ఫైనల్‌ నిర్ణయం సెలక్టర్లదే’ అని గంగూలీ తెలిపాడు.

>
మరిన్ని వార్తలు