జెమీమా 2.. మంధాన 6

12 Feb, 2019 15:50 IST|Sakshi

దుబాయి: భారత మహిళా స్టార్‌ క్రికెటర్లు జెమీమా రోడ్రిగ్స్‌, స్మృతీ మంధానలు తమ టీ20 ర్యాంకింగ్స్‌ను మరింత మెరుగుపరుచుకున్నారు. తాజాగా విడుదల చేసిన మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో భాగంగా బ్యాటింగ్‌ విభాగంలో రోడ్రిగ్స్‌ రెండో స్థానాన్ని ఆక్రమించగా, మంధాన ఆరు స్థానానికి చేరుకున్నారు. వీరిద్దరూ నాలుగేసి స్థానాలు ఎగబాకి తమ స్థానాలను మెరుగుపరుచుకున్నారు.

న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో రోడ్రిగ్స్‌ 132 పరుగులు చేయగా, మంధాన 180 పరుగులు చేశారు. మంధాన చేసిన పరుగుల్లో రెండు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. చివరి మ్యాచ్‌లో మంధాన 86 పరుగులతో ఆకట్టుకున్నారు. గతవారం విడుదల చేసిన మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో మంధాన టాప్‌ను ఆక్రమించిన సంగతి తెలిసిందే. ఇక బౌలర్ల ర్యాంకింగ్స్‌లో స్సిన్నర్లు రాధా యాదవ్‌ 10 స్థానంలో నిలవగా, దీప్తి శర్మ 14వ స్థానంలో నిలిచారు. పూనమ్‌ యాదవ్‌ రెండో స్థానంలో కొనసాగుతున్నారు. ఇక జట్టు ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్‌ రెండో స్థానానికి ఎగబాకింది. తొలి స్థానంలో ఆస్ట్రేలియా ఉండగా, మూడో స్థానంలో ఇంగ్లండ్‌, నాల్గో స్థానంలో భారత్‌ ఉన్నాయి.

మరిన్ని వార్తలు