ఫెడరర్‌ ఫటాఫట్‌!

16 Mar, 2018 02:20 IST|Sakshi

సీజన్‌లో వరుసగా 15వ విజయం

ఇండియన్‌ వెల్స్‌ టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశం

కాలిఫోర్నియా: కొత్త సీజన్‌లో తన విజయపరంపర కొనసాగిస్తూ స్విట్జర్లాండ్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ ఇండియన్‌ వెల్స్‌ మాస్టర్స్‌ సిరీస్‌ టోర్నమెంట్‌లో క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్‌ ఫెడరర్‌ 7–5, 6–4తో జెరెమీ చార్డీ (ఫ్రాన్స్‌)పై గెలుపొందాడు. 36 ఏళ్ల ఫెడరర్‌కు ఈ ఏడాది వరుసగా 15వ విజయం కావడం విశేషం. 2006 తర్వాత ఓ సీజన్‌లో ఫెడరర్‌ వరుసగా 15 విజయాలు సాధించడం ఇదే తొలిసారి. 2006లో ఫెడరర్‌ వరుసగా 16 మ్యాచ్‌ల్లో గెలుపొందాడు.

క్వార్టర్‌ ఫైనల్లో 30వ సీడ్‌ హైయాన్‌ చుంగ్‌ (దక్షిణ కొరియా)తో ఫెడరర్‌ ఆడనున్నాడు.  ప్రపంచ 100వ ర్యాంకర్‌ జెరెమీ చార్డీతో 82 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో ఫెడరర్‌ వరుస సెట్‌లలో ఒక్కోసారి సర్వీస్‌ బ్రేక్‌ చేశాడు. కేవలం రెండు ఏస్‌లు సంధించిన అతను ఒక్క డబుల్‌ ఫాల్ట్‌ కూడా చేయలేదు. ఫెడరర్‌ చేసిన 25 తొలి సర్వీస్‌లలో పాయింట్లు పొందడం విశేషం. ‘సీజన్‌ గొప్పగా సాగుతోంది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో, రోటర్‌డామ్‌ ఓపెన్‌లో టైటిల్స్‌ గెలిచాను. ఈ టోర్నీలో ఇప్పటికే మూడు మ్యాచ్‌ల్లో నెగ్గాను. అంతా సాఫీగా సాగిపోతున్నందుకు ఆనందంగా ఉన్నాను’ అని రికార్డుస్థాయిలో ఆరోసారి ఈ టైటిల్‌పై గురి పెట్టిన ఫెడరర్‌ వ్యాఖ్యానించాడు.

మరిన్ని వార్తలు