రోహిత్‌ మరో రికార్డు

22 Oct, 2019 10:59 IST|Sakshi

రాంచీ: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ ద్వారా ఓపెనర్‌గా అరంగేట్రం చేసిన టీమిండియా హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ మరో అరుదైన రికార్డును సాధించాడు. దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో రోహిత్‌(212) డబుల్‌ సెంచరీ సాధించడంతో ఒక అరుదైన ఫీట్‌ను నమోదు చేశాడు. ఒక టెస్టు మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టు రెండు వేర్వేరు ఇన్నింగ్స్‌ల్లో నమోదు చేసిన స్కోరు కంటే ఎక్కువ పరుగులు సాధించిన ఐదో భారత్‌ ఆటగాడిగా రోహిత్‌ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకు ఆలౌటైతే, రెండో ఇన్నింగ్స్‌లో 133 పరుగులకే చాపచుట్టేసింది. దాంతో రోహిత్‌ చేసిన పరుగుల్ని కూడా సఫారీలు తమ ఇన్నింగ్స్‌లో సాధించలేకపోయారు.

అంతకుముందు ఈ ఘనత సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో వినూ మన్కడ్‌(231-న్యూజిలాండ్‌పై) తొలిసారి ఈ మార్కును చేరగా, ఆపై రాహుల్‌ ద్రవిడ్‌(270- పాకిస్తాన్‌పై) రెండో స్థానంలో ఉన్నాడు. ఒక మూడు స్థానంలో సచిన్‌ టెండూల్కర్‌(248-బంగ్లాదేశ్‌పై), నాల్గో స్థానంలో విరాట్‌ కోహ్లి(243-శ్రీలంకపై)లు ఉన్నారు.

1955-56 సీజన్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో మన్కడ్‌ ఈ ఫీట్‌ సాధించాడు. ఆ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో కివీస్‌ 209 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 219 పరుగులు చేసింది. 2003-04 సీజన్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్‌ ద్రవిడ్‌ దీన్ని సాధించాడు. పాకిస్తాన్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకు ఆలౌటైతే, రెండో ఇన‍్నింగ్స్‌లో 245 పరుగులు చేసింది. 2004-05 సీజన్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సచిన్‌ ఈ జాబితాలో చేరాడు. బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 184 పరుగులకు ఆలౌటైతే, రెండో ఇన్నింగ్స్‌లో 202 పరుగులు చేసింది. 2017-18 సీజన్‌లో శ్రీలంకతో మ్యాచ్‌ జరగ్గా ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 205 ఆలౌటైతే, రెండో ఇన్నింగ్స్‌లో 166 పరుగులకు ఆలౌటైంది.

మరిన్ని వార్తలు