పోర్ట్ ఎలిజబెత్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ద్వైపాక్షిక సిరీస్లో భారత ఓపెనర్ రోహిత్ శర్మ ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చాడు. ఈ సిరీస్లో తొలిసారి హాఫ్ సెంచరీ సాధించి సత్తాచాటాడు. ఇప్పటివరకూ జరిగిన ఓవరాల్ సిరీస్లో తీవ్రంగా నిరాశపరిచిన రోహిత్.. సఫారీలతో ఐదో వన్డేలో అర్థ శతకంతో మెరిశాడు. 50 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు సాయంతో హాఫ్ సెంచరీ చేశాడు. తొలి వికెట్గా శిఖర్ ధావన్(34; 23 బంతుల్లో 8 ఫోర్లు) అవుటైన తర్వాత రోహిత్ బాధ్యతాయుతంగా ఆడాడు. కెప్టెన్ విరాట్ కోహ్లితో కలిసి సమయోచితంగా ఆడుతూ హాఫ్ సెంచరీ మార్కును చేరాడు.
ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో భారత ఇన్నింగ్స్ ను రోహిత్ శర్మ, శిఖర్ ధావన్లు ఆరంభించారు. అయితే ధాటికి ఆడే క్రమంలో ధావన్ మొదటి వికెట్గా అవుటయ్యాడు. ఒక భారీ షాట్కు యత్నించి రబడా బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. ఆ తరుణంలో రోహిత్-కోహ్లిల జోడి ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టింది. వీరిద్దరూ నిలకడగా ఆడటంతో భారత జట్టు 21 ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది.