మరో రికార్డుకు చేరువలో రోహిత్‌..

3 Nov, 2018 18:30 IST|Sakshi

కోల్‌కతా: వెస్టిండీస్‌తో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌లో రెండు భారీ శతకాలు బాదిన రోహిత్ శర్మ..  పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే హిట్‌మ్యాన్‌ రోహిత్‌ను మరో రికార్డు ఊరిస్తోంది. అంతర్జాతీయ టీ20ల్లోనూ అరుదైన రికార్డుకి చేరువలో ఉన్నాడు రోహిత్‌. భారత్ జట్టు ఆదివారం నుంచి వెస్టిండీస్‌తో మూడు టీ20ల సిరీస్‌లో తలపడనుండగా.. ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ మరో 186 పరుగులు చేస్తే అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసి బ్యాట్స్‌మన్‌గా రికార్డుల్లో నిలవనున్నాడు.

ఈ జాబితాలో ఇప్పటి వరకు అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లను పరిశీలిస్తే.. న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ 2,271 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. షోయబ్ మాలిక్ (పాకిస్తాన్) 2,171 పరుగులు, బ్రెండన్ మెక్‌కలమ్ (న్యూజిలాండ్) 2,140 పరుగులు, విరాట్ కోహ్లి (భారత్) 2,102 పరుగులతో టాప్-4లో కొనసాగుతున్నారు. ఇక ఐదో స్థానంలో 2,086 పరుగులతో కొనసాగుతున్న రోహిత్ శర్మ.. మూడు టీ20ల్లో కలిపి 186 పరుగులు చేయగలిగితే అగ్రస్థానంలో నిలుస్తాడు.

టీ20 సిరీస్ నుంచి కెప్టెన్‌ కోహ్లీకి విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు రోహిత్ శర్మకి జట్టు పగ్గాలు అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో కోహ్లి నుంచి రోహిత్‌ శర్మకు పోటీ లేకుండా పోయింది. మరో 16 పరుగులు చేస్తే కోహ్లి టీ20 పరుగుల రికార్డుని రోహిత్‌ సమం చేస్తాడు.రేపు(ఆదివారం) భారత్‌-విండీస్‌ జట్ల మధ్య ఈడెన్‌ గార్డెన్‌ మైదానంలో తొలి టీ20 జరుగనుంది.

ఇక్కడ చదవండి: రోహిత్‌ శర్మ సరికొత్త రికార్డు

సచిన్‌ రికార్డును బ్రేక్‌ చేశాడు..

మరిన్ని వార్తలు