మా వాళ్లతో అదే చెప్పా: రోహిత్‌ శర్మ

22 May, 2017 08:38 IST|Sakshi
మా వాళ్లతో అదే చెప్పా: రోహిత్‌ శర్మ

హైదరాబాద్‌: ఐపీఎల్‌-10 టైటిల్‌ విజయంలో కీలకపాత్ర పోషించిన తమ బౌలర్లపై ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ప్రశంసలు కురిపించాడు. తుదిపోరులో తమ టీమ్‌ అద్భుతంగా ఆడిందని మెచ్చుకున్నాడు. రెండు జట్లు హోరాహోరీగా తలపడ్డాయని, మ్యాచ్‌ బాగా జరిగిందని పేర్కొన్నాడు. రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ మైదానంలో ఆదివారం రాత్రి ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్‌ జట్టును ఒక్క పరుగు తేడాతో ఓడించి రోహిత్‌ సేన టైటిల్‌ కైవసం చేసుకుంది.

‘క్రికెట్‌లో ఇది గొప్ప మ్యాచ్‌. అందరూ ఎంజాయ్‌ చేసివుంటారని భావిస్తున్నాను. ఈ స్కోరును కాపాడుకోవాలంటే తెలివిగా వ్యవహరించాలి. దీని గురించి ఇంతకంటే ఎక్కువ నన్ను అడగలేరు. స్వల్ప స్కోరును కాపాడుకోవాలంటే ముందు మన మీద మనకు పూర్తి నమ్మకం ఉండాలి. తక్కువ స్కోరు చేసినా తుదివరకు పోరాడాలని సహచర ఆటగాళ్లకు చెప్పాను. చివరి మూడు ఓవర్లు మిగులుండగా బౌలర్లపై నమ్మకం ఉంచాను. వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాను. బౌలర్లు చెప్పినట్టుగానే ఫీల్డింగ్‌ పెట్టాను. నా నమ్మకాన్ని వారు నిలబెట్టార’ని మ్యాచ్‌ ముగిసిన తర్వాత రోహిత్‌ శర్మ అన్నాడు.

మరిన్ని వార్తలు