'ఆరోజు రితికా అందుకే ఏడ్చింది'

6 Jun, 2020 16:20 IST|Sakshi

ముంబై : కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించడంతో క్రికెటర్లంతా తమ ఇళ్లలోనే ఉంటూ తోటి ఆటగాళ్లు నిర్వహిస్తున్న లైవ్‌ చాట్‌లో పాల్గొంటున్నారు. తాజాగా భారత  క్రికెటర్లు రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్ బీసీసీఐ టీవీలో నిర్వహించిన 'ఓపెన్‌ నెట్స్‌ విత్‌ మయాంక్‌' షోలో సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా రోహిత్‌ శర్మ పలు ఆసక్తికర విషయాలు చర్చించాడు. మాటల మధ్యలో రోహిత్‌ శర్మ తన మూడో డబుల్‌ సెంచరీని గుర్తు చేసుకుంటూ, తన భార్య రితికా మొహాలి స్టాండ్స్‌లో కన్నీళ్లు పెట్టుకోవడానికి గల కారణం వెల్లడించాడు. 

'ఆ మ్యాచ్‌లో నేను 195 పరుగుల వద్ద ఉన్నప్పుడు సింగిల్‌ తీయాల్సి వచ్చింది. పరుగు కోసం పరిగెత్తిన నేను డైవ్‌ చేశాను. ఇంకా నేను డబుల్‌ సెంచరీ సాధించకముందే అంటే 196 పరుగుల వద్ద ఉన్నప్పుడు రితికా భావోద్వేగానికి లోనైంది. ఎందుకు ఏడ్చావు అని నేను ఆమెను (రితికా) అడిగాను? అప్పుడు పరుగు తీస్తున్న క్రమంలో డైవ్‌ చేయడంతో చేతికి దెబ్బ తగిలిందేమోనని భావోద్వేగానికి లోనయ్యానంటూ రితికా తర్వాత చెప్పింది. అంతేగాక ఆరోజు చేసిన డబుల్‌ సెంచరీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎందుకంటే నేను డబుల్‌ సెంచరీ చేసిన రోజే మా పెళ్లిరోజు కాబట్టి' అంటూ మయాంక్‌తో చెప్పుకొచ్చాడు. (లారా ఆ రికార్డు సాధించి 26 ఏళ్లు..)

వన్డే క్రికెట్లో మూడు డబుల్‌ సెంచరీలు సాధించి అంతర్జాతీయ క్రికెట్లో ఎవరికీ సాధ్యంకాని రికార్డు నెలకొల్పిన ఏకైక క్రికెటర్‌గా రోహిత్‌ శర్మ నిలిచాడు. రోహిత్‌ సాధించిన మూడు డబుల్‌ సెంచరీల్లో రెండు శ్రీలంకపై(2014,2017) సాధించగా, ఒకటి మాత్రం ఆస్ట్రేలియాపై(2013) సాధించాడు. టీమిండియా తరపున రోహిత్‌ శర్మ 224 వన్డేల్లో 9115 పరుగులు, 32 టెస్టుల్లో 2141 పరుగులు, 108 టీ20ల్లో 2773 పరుగులు సాధించాడు.(కోహ్లి కంటే స్మిత్‌ బెటర్‌: జాఫర్‌)   

మరిన్ని వార్తలు